టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ మైదానం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో షోయబ్ బషీర్ వేసిన 100వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్గా మలిచి 145 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ వెంటనే తనదైన శైలిలో పిల్ల మొగ్గలు వేస్తూ సంబరాలు చేసుకున్నాడు.
ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. రిషభ్ పంత్ సెంచరీ చేయగానే సూపర్బ్.. సూపర్బ్.. సూపర్బ్ అంటూ కొనియాడాడు. 99 పరుగుల వద్ద సిక్సర్ బాది మరి సెంచరీ పూర్తి చేసుకోవడంతో పంత్పై గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అయితే ఇదే గవాస్కర్.. ఆస్ట్రేలియా పర్యటనలో నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకున్నప్పుడు స్టుపిడ్ స్టుపిడ్ స్టుపిడ్ అంటూ మండిపడ్డాడు. దాంతో ఈ రెండు సందర్భాలను ప్రస్తావిస్తూ ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు. 'తిట్టినొళ్లతోనే పొగిడించుకోవాలి.. పంత్ మజాకా'అంటూ కామెంట్ చేస్తున్నారు.

రిషభ్ పంత్కు ఇది ఏడో టెస్ట్ సెంచరీ. ధోనీ 6 శతకాల రికార్డ్ను పంత్ అధిగమించాడు. టెస్ట్ క్రికెట్లో సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో పంత్, ధోనీ తర్వాత సాహా మూడు శతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ 90 టెస్ట్ మ్యాచ్ల్లో 6 సెంచరీలు చేస్తే.. పంత్ 44 మ్యాచ్ల్లోనే 7 శతకాలు నమోదు చేశాడు.
ఆసియా బయట ఎక్కువ సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్గా కూడా పంత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. సిక్సర్తో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ రికార్డ్ను పంత్ సమం చేశాడు. ఈ ఇద్దరూ మూడు సెంచరీలను సిక్సర్తో పూర్తి చేశారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 6 శతకాలను సిక్సర్తో పూర్తి చేశాడు. అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో పంత్ నాలుగో స్థానానికి చేరాడు. కుమార సంగక్కర, ఏబీ డివిలియర్స్, మ్యాట్ ప్రియర్, బీజే వాట్లింగ్తో సమంగా నిలిచాడు.
రిషభ్ పంత్ సెంచరీ తర్వాత శుభ్మన్ గిల్ ఔటవ్వడంతో నాలుగో వికెట్కు నమోదైన 209 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత భారత్ పంత్తో సహా వరుసగా వికెట్లు కోల్పోయింది. దాంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 471 పరుగులకు ముగించింది. రిషభ్ పంత్(178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్లతో 134), శుభ్మన్ గిల్(227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్తో 147), యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 101) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/86), బెన్ స్టోక్స్(4/66) నాలుగేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు 41 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి 7 వికెట్లు కోల్పోయింది.