ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీల ప్లేయర్స్ ట్రేడింగ్ వివరాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్లోకి వెళ్లగా.. ఆ జట్టుకు చెందిన రవీంద్ర జడేజా, సామ్ కరణ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చారు. సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన మహమ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్ తీసుకోగా.. కేకేఆర్కు చెందిన మయాంక్ మార్కండేను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది.
అనూహ్యంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను లక్నో సూపర్ జెయింట్స్ తీసుకోగా.. రాజస్థాన్ రాయల్స్కు చెందిన నితీష్ రాణాను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్ చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్కు చెందిన ఆల్రౌండర్ డోనోవన్ ఫెర్రీరాను రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. ఈ క్రాష్ ట్రేడ్ డీల్స్లో కొందరి ధరలు తగ్గగా మరికొందరు ధరలు పెరిగాయి. ఒక్కో ఆటగాడికి సంబంధించిన ట్రేడ్ డీల్ వివరాలను తెలుసుకుందాం.

వెటరన్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా సీఎస్కే తరఫున 12 సీజన్లు ఆడాడు. ఎంతో అనుభవం కలిగిన జడేజా ఇప్పటికే 250 ప్లస్ ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. గత సీజన్లో రూ. 18 కోట్ల భారీ ధరకు సీఎస్కే రిటైన్ చేసుకోగా.. రాజస్థాన్ రాయల్స్ రూ.14 కోట్ల క్యాష్ డీల్తో తమ జట్టులోకి ట్రేడ్ చేసుకుంది. జడేజా ధర రూ.4 కోట్ల తగ్గింది. అయితే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సంజూ శాంసన్ను తన పాత ధర రూ.18 కోట్లకే సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. ఈ లీగ్లో అత్యంత అనుభవం కలిగిన వికెట్ కీపర్ అయిన సంజూ.. ఇప్పటి వరకు 177 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 2013లో అరంగేట్రం చేసిన సంజూ రెండు సీజన్లు(2016, 2017)ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడాడు. మిగతా 11 సీజన్లు రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు సీఎస్కే ఆడబోతున్నాడు.
సీఎస్కేకు చెందిన సామ్ కరన్ను రాజస్థాన్ రాయల్స్ తన పాత ధర రూ.2.4 కోట్లకే ట్రేడ్ చేసుకుంది. 27 ఏళ్ల సామ్ కరణ్ ఇప్పటివరకు 64 మ్యాచ్లు ఆడాడు. అతనికి రాజస్థాన్ రాయల్స్ మూడో ఫ్రాంచైజీ. 2019, 2023, 2024 సీజన్లలో కేకేఆర్కు ఆడాడు.
సన్రైజర్స్కు చెందిన మహమ్మద్ షమీని రూ.10 కోట్ల పాత ధరకే లక్నో ట్రేడ్ చేసుకుంది. ఇప్పటి వరకు 119 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన షమీ.. సన్రైజర్స్కు ముందు గుజరాత్ టైటాన్స్కు ఆడాడు.
లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను అతని రూ.30 లక్షల ధరకే ముంబై ట్రేడ్ చేసుకుంది. ముంబైతోనే కెరీర్ ప్రారంభించిన మార్కండే 2018, 2019, 2022 సీజన్లు ఆడాడు. 2021లో రాజస్థాన్ రాయల్స్కు ఆడిన మార్కండే 2023, 2024లో సన్రైజర్స్కు ప్రాతినిథ్యం వహించాడు. గత సీజన్లో అతన్ని కేకేఆర్ తీసుకుంది. ఇప్పటి వరకు 37 మ్యాచ్లు ఆడి 37 వికెట్లు పడగొట్టాడు.
బౌలింగ్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ను అతని ధర రూ.30 లక్షలకే లక్నో ట్రేడ్ చేసుకుంది. ముంబై తరఫునే ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన టెండూల్కర్.. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు మాత్రమే ఆడాడు.
లెఫ్టార్మ్ బ్యాటర్ నితీష్ రాణాను ఢిల్లీ క్యాపిటల్స్ అతని రూ. 4.2 కోట్ల ధరకే ట్రేడ్ చేసుకుంది. 100కు పైగా ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన రాణా.. కేకేఆర్కు సారథ్యం కూడా వహించాడు.
ఆల్రౌండర్ డోనవన్ ఫెర్రీరాను కోటీ రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ ట్రేడ్ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అతని ధర రూ.75 లక్షలే కాగా.. మరో రూ.25 వేలు పెంచి మరి రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. ఇప్పటికే శార్దూల్ ఠాకూర్, షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్ను ట్రేడ్ చేసుకున్నట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.