2014లో రంజీల్లోకి..
అయితే అయ్యర్ సాధించిన విజయం వెనుక చాలా కష్టం ఉంది. అపారమైన రంజీ క్రికెట్ అనుభవం ఉంది. 2014లో ముంబై తరఫున రంజీ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. తొలి రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. మూడో మ్యాచ్లోనూ ముంబై జట్టు 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో తీవ్ర ఒత్తిడిలో అయ్యర్ బరిలో దిగాడు. ఈ మ్యాచ్లో అతను సత్తా చాటకపోతే జట్టులో స్థానం గల్లంతైనట్టే! ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మ్యాచ్ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడి ముంబైని గెలిపించాడు. తన కెరీర్ ఎక్కడ మలుపు తిరిగిందో అదే కాన్పూర్లో న్యూజిలాండ్పై టెస్టు అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లోనే అదిరే ఆటతో ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు.
టెస్ట్ల్లోనూ దూకుడు..
రంజీ క్రికెట్లో తన తొలి సీజన్లోనే 809 పరుగులు చేసిన అతను.. ఆ తర్వాత సీజన్లో ఏకంగా 1321 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఒక రంజీ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వీవీఎస్ లక్ష్మణ్ రికార్డుకు అతడు 95 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కోచ్ ప్రవీణ్ ఆమ్రే మార్గదర్శనంలో ఎదిగిన శ్రేయస్.. సుదీర్ఘ ఫార్మాట్లో బలమైన పునాది వేసుకున్నాడు. ఒకవైపు ఓర్పుగా ఆడుతూనే గేర్లు మారుస్తూ స్కోరు చేయడం, ఎలాంటి బౌలింగ్నైనా బెదరకుండా ఎదుర్కోవడం శ్రేయస్ స్టైల్. అతను 82 స్ట్రయిక్ రేట్తో పరుగులు సాధించడం విశేషం. కఠిన పరిస్థితుల్లో, తీవ్ర ఒత్తిడిలో మరింత పట్టుదలగా ఆడటం అతడి నైజం. కెరీర్ ఆరంభం నుంచి అతడిది అదే తీరు. తన కెరీర్ను మలుపు తిప్పిన కాన్పూర్ రంజీ మ్యాచ్లో.. పూర్తిగా పేసర్లకు సహకరిస్తున్న పిచ్పై ప్రవీణ్కుమార్ లాంటి బౌలర్లను ఎదుర్కొంటూ అతను విలువైన 75 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. సగం బ్యాటర్లు నిష్క్రమించిన స్థితిలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. తొలి 10 బంతుల్లోనే 6 బౌండరీలు కొట్టాడంటేనే అతడి దూకుడును అర్థం చేసుకోవచ్చు.
ఆసుపత్రి నుంచి..
కెరీర్ సాఫిగా సాగుతుండుగా అయ్యర్ను దురదృష్టం వెంటాడింది. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్తో సిరీస్లో భుజానికి సర్జరీ కావడంతో కొన్ని రోజులు హాస్పిటల్ బెడ్పై ఉన్నాడు. దాదాపు ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న అతను ఇప్పట్లో టెస్ట్ అరంగేట్రం చేస్తానని కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే సర్జరీ తర్వాత ఐపీఎల్ 2021 సెకండాఫ్తో పాటు న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో కూడా పెద్దగా రాణించలేదు. అయినా టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారిని కాదని సెలెక్టర్లు చాన్స్ ఇచ్చారు. మిడిలార్డర్లో కొంచెం వేగంగా ఆడే ఆటగాడు అవసరమని, దానికి అయ్యరే సరైనోడని భావించారు. విమర్శలు వచ్చినా.. టీమ్మేనేజ్మెంట్ వెనక్కు తగ్గలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టీమ్ కోరుకున్న విధంగా దూకుడైన బ్యాటింగ్తో భారత ఇన్నింగ్స్ను ట్రాక్లోకి తెచ్చాడు. మార్చిలో తాను హాస్పిటల్ బెడ్పై ట్రీట్మెంట్ తీసుకున్న విజువల్స్.. రీసెంట్గా టెస్ట్ టీమ్ జెర్సీతో ఫొటో షూట్ను కలిపి చేసిన వీడియోను అయ్యర్ మంగళవారం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దీన్నిబట్టి టెస్ట్ టీమ్లోకి వచ్చేందుకు తాను ఎంతగా ఆశ పడ్డాడో అర్థం చేసుకోవచ్చు.
2017లోనే చాన్స్ వచ్చినా..
నిజానికి శ్రేయస్కు టెస్టు అరంగేట్రం చేసే అవకాశం 2017లోనే తలుపు తట్టింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ధర్మశాలలో ఆస్ట్రేలియాతో చివరిదైన నాలుగో టెస్టులో విరాట్ కోహ్లికి ప్రత్యామ్నాయంగా అయ్యర్ను ఎంపిక చేశారు. కానీ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ సిరీస్లో భారత్ గెలిచింది. అప్పటి నుంచి అతను తన తొలి టెస్టు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అందుకున్న టెస్టు క్యాప్ శ్రేయస్కు ఎంతో అమూల్యం. ఎందుకంటే ఎంతో కాలం ఎదురు చూడగా వచ్చిన అవకాశం మాత్రమే కాదు..54 ఫస్ట్ క్యాచ్ మ్యాచ్లు ఆడిన తర్వాత 4592 పరుగులు చేశాక అతనికి టెస్ట్ల్లో అవకాశం దక్కింది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా క్యాప్ అందుకోవడంతో అయ్యర్ కల నేరవేరింది.