ఐపీఎల్ 2025 సీజన్లో ఆటగాళ్ల రీ ప్లేస్మెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అనుమతిచ్చింది. కానీ ఈ రీ ప్లేస్మెంట్స్కు షరతులు వర్తిస్తాయని తెలిపింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో ఐపీఎల్ 2025ను వారం పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దాంతో విదేశీ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో మే 17 నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. అయితే కొంతమంది విదేశీ ఆటగాళ్లు తిరిగి భారత్కు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
కొందరు తమ జాతీయ జట్టు మ్యాచ్ల కోసం దూరంగా ఉంటే..మరికొందరు గాయాలు, వ్యక్తిగత కారణాలతో టోర్నీలోని మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో ఐపీఎల్ టీమ్స్ ఇబ్బంది పడకుండా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కలిక రీ ప్లేస్మెంట్కు అవకాశం ఇచ్చింది. అయితే ఈ రీప్లేస్మెంట్లు వచ్చే సీజన్లో కొనసాగవని స్పష్టం చేసింది. తాత్కలికంగా ఇప్పుడు చేరే జట్లలోని ఆటగాళ్లు ఐపీఎల్ 2026 మినీ వేలం సమయంలో మళ్లీ తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐపీఎల్ సీఓఓ హేమంగ్ ఫ్రాంచైజీలకు సమాచారం అందించారు.

ఈ రూల్ ప్రకారమే ఢిల్లీ క్యాపిటల్స్.. జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ స్థానాన్ని బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్తో భర్తీ చేసింది. రూ. 6 కోట్లకు అతన్ని తీసుకుంది. ఈ సీజన్లో జేక్ ఫ్రెజర్-మెక్గర్క్ దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్ల్లో 9.17 సగటుతో 55 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. గత సీజన్లో జేక్ ఫ్రెజర్ మెక్ గర్క్ మెరుగైన ప్రదర్శన చేశాడు. 234.04 స్ట్రైక్రేట్తో 330 పరుగులు కొట్టాడు. దాంతో అతన్ని మెగా వేలంలో రైట్ టూ మ్యాచ్ కార్డ్ వాడి మరి ఢిల్లీ కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు.