
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్) 2020 సీజన్ కోసం రెడీ అవుతున్న మెజారిటీ ఫ్రాంచైజీలు.. వామప్ మ్యాచ్కు పర్మిషన్ ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ)కి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న ప్రారంభం కానున్న తొలి మ్యాచ్కు ముందు ఈ వామప్ మ్యాచ్లు నిర్వహించాలని, దీనివల్ల ప్లేయర్లకు చాలా మంచి జరుగుతుందని బోర్డును కోరాయని ఇన్సైడ్ స్పోర్ట్స్ పేర్కొంది.
కరోనా లాక్డౌన్తో స్వదేశీ, విదేశీ క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సరైన ఫిజికల్ ట్రైయినింగ్ కూడా చేయలేదు. ఇవేమీ లేకుండానే దాదాపుగా ఐదు నెలల తర్వాత నేరుగా మైదానంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్లు ఉంటే ప్లేయర్లు త్వరగా ఆటకు అలవాటు పడతారని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ ఇండియా కూడా వామప్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది.
అయితే షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వామప్ మ్యాచ్ల గురించి ఆలోచిద్దామనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వామప్ మ్యాచ్లు నిర్వహించాలనుకుంటే మాత్రం సెప్టెంబర్ 11 నుంచి 16 మధ్య జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయా జట్లు అంతర్గత జట్లను తయారు చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపారు. 5-6 ఫ్రాంచైజీలు వామప్ మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐని కోరాయని, రెండు, మూడు రోజుల్లో బోర్డు నుంచి స్పందన వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఒకటి, రెండు రోజుల్లో బీసీసీఐ.. ఐపీఎల్ 2020 షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్పారు.
ఇక ఇప్పటికే దుబాయ్ చేరుకున్న అన్ని జట్లలో చెన్నై మినహా అన్ని టీమ్స్ నెట్ ప్రాక్టీస్ ప్రారంభించాయి. చెన్నై కూడా గురువారం నిర్వహించే పరీక్షల్లో నెగటీవ్ వస్తే మైదానంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే చెన్నై ప్రారంభ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేదని, షెడ్యూల్లో మార్పులు చేసే అవకాశం ఉందని వార్తలు కూడా వచ్చాయి. ఆర్సీబీ, ముంబై మధ్య ఫస్ట్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.