Fox Cricket All Time Men's World Cup XI: 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్ చానెల్ ఆల్టైమ్ వరల్డ్ కప్ ఎలెవన్ను ఎంపిక చేసింది. వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన నేపథ్యంలో ఈ జట్టును ప్రకటించింది. ఈ ఆల్టైమ్ ప్రపంచకప్ ఎలెవన్లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురు ప్లేయర్లకు అవకాశం దక్కింది.
భారత్ నుంచి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలకు ఈ ఆల్టైమ్ ఎలెవన్లో చోటు దక్కగా.. ఆస్ట్రేలియా నుంచి రికీ పాంటింగ్, మిచెల్ స్టార్క్, దివంగత షేన్ వార్న్, గ్లేన్ మెక్గ్రాత్లు ఎంపికయ్యారు. వెస్టిండీస్ నుంచి వీవ్ రిచర్డ్స్ ఒక్కనికే అవకాశం దక్కగా.. పాకిస్థాన్ నుంచి వసీమ్ అక్రమ్ చోటు దక్కించుకున్నాడు.

శ్రీలంక నుంచి ముత్తయ్య మురళీదరణ్తో పాటు కుమార సంగక్కరకు అవకాశం దక్కింది. భారత్కు ప్రపంచకప్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి ఈ జట్టులో చోటు దక్కలేదు. ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్గా నిలిచిన ధోనీ ఈ జట్టులో చోటివ్వకపోవడంపై అతని అభిమానులు పెదవి విరుస్తున్నారు.
వికెట్ కీపర్, కెప్టెన్సీ పరంగా కుమార సంగక్కర కంటే ధోనీ ఎంతో బెటరని కామెంట్ చేస్తున్నారు. ఈ ఆల్టైమ్ బెస్ట్ ఎలెవన్కు ఫాక్స్ క్రికెట్ రికీ పాంటింగ్ను సారథిగా ప్రకటించింది. రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆసీస్ 2003, 2007 వన్డే ప్రపంచకప్లను వరుసగా గెలిచింది.
ఫాక్స్ క్రికెట్ ప్రకటించిన ఈ జట్టు ఆల్టైమ్ ఎలెవన్లా లేదని, గత 24 ఏళ్లలో అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లతో ఈ జట్టును ఎంపిక చేశారని కామెంట్ చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆసీస్ ఆరోసారి టైటిల్ను ముద్దాడిన విషయం తెలిసిందే.
టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా వరుసగా 10 విజయాలతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరి.. కీలక పోరులో తడబడింది. పేలవ బ్యాటింగ్కు తోడు దురదృష్టం కూడా తోడవ్వడంతో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.