భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. మూడు టెస్ట్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. లార్డ్స్ వేదికగా ఆద్యంతం ఆసక్తిగా సాగిన మూడో టెస్ట్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి రోజు చివరి సెషన్ వరకు సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజాను అందించింది. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ను టీమిండియా చేజేతులా చేజార్చుకుంది. టెయిలెండర్స్ సాయంతో ఆఖరి వరకు జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. ఒక్క బ్యాటర్ అతనికి అండగా నిలిచినా భారత్ విజయం సాధించేది. మాంచెస్టర్ వేదికగా జులై 23 నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలంటే నాలుగు విషయాల్లో మెరుగవ్వాలి.
నాలుగో టెస్ట్లో టీమిండియా సరైన తుది జట్టుతో బరిలోకి దిగాలి. తొలి రెండు టెస్ట్ల్లో చెలరేగిన బ్యాటర్లు.. కాస్త సీమ్, స్వింగ్ ఉన్న వికెట్పై తేలిపోయారు. దాంతో 193 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేధించలేకపోయింది. ముఖ్యంగా కరుణ్ నాయర్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. అతను మూడు టెస్ట్ల్లో 0, 20, 31, 20, 40, 14 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగో టెస్ట్కు కరుణ్ నాయర్ను తప్పించే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్ తుది జట్టులోకి రావచ్చు. రిషభ్ పంత్ గాయం కూడా ఆందోళన కలిగిస్తోంది. వర్క్లోడ్ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇస్తారా? కొనసాగిస్తారా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలనే డిమాండ్ కూడా గత మూడు టెస్ట్లుగా గట్టిగా వినిపిస్తోంది. ఏది ఏమైనా పిచ్ కండిషన్స్కు తగ్గట్లు టీమిండియా సరైన కాంబినేషన్తో బరిలోకి దిగాలి.

మూడో టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి భారత బౌలర్లు ఎక్స్ట్రాల రూపంలో 63 పరుగులు సమర్పించుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో 31, రెండో ఇన్నింగ్స్లో 32 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో ఇచ్చారు. ఈ మ్యాచ్లో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఎక్స్ట్రాలను నియంత్రించి ఉంటే భారత్ సునాయసంగా గెలిచేది. నాలుగో టెస్ట్లో ఎక్స్ట్రాలు ఇవ్వకుండా టీమిండియా కట్టడిగా బౌలింగ్ చేయాలి. ముఖ్యంగా వికెట్ కీపర్ అలర్ట్గా ఉండాలి. మూడో టెస్ట్లో పంత్ గాయపడటంతో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. వికెట్ల వెనుకాల అతను తడబడటంతో బైస్ రూపంలో పరుగులు వచ్చాయి. వీటిపై టీమిండియా ఫోకస్ పెట్టాలి.
ఇంగ్లండ్ టాపార్డర్, మిడిలార్డర్ను పెవిలియన్ చేర్చుతున్న భారత బౌలర్లు.. టెయిలెండర్స్ మాత్రం త్వరగా ఔట్ చేయలేకపోతున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ టెయిలెండర్స్ 8వ వికెట్కు 84 పరుగులు జోడించారు. తోకను త్వరగా కట్ చేస్తే టీమిండియా అవకాశాలు మరింత మెరుగవుతాయి.
మూడో టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్ల కవ్వింపులు ఎక్కువయ్యాయి. చివరి సెషన్లో బ్యాటర్లను ఔట్ చేసేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు నోటికి పనిచెప్పారు. గిల్ను కవ్వించారు. ఐదో రోజు ఆటలో నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాలను రెచ్చగొట్టారు. 'నితీష్ను నీ స్థాయి ఏంటో తెలుసా.. ఐపీఎల్లో నోరు మెదపేవాడివి కాదు.'అనగా.. జడేజాను 'నువ్వెం కష్టపడ్డా బీసీసీఐ గుర్తించదు.. నీ పోరాటం వృథా'అంటూ నోరుపారేసుకున్నారు. ఈ స్లెడ్జింగ్ చూసి విరాట్ కోహ్లీ ఉంటే బాగుండని అంతా అనుకున్నారు. శుభ్మన్ గిల్ కూడా కోహ్లీ తరహాలోనే దూకుడు కనబర్చాలి. మాటకు మాట బదులివ్వాలి.