
కొంపముంచిన అతి జాగ్రత్త..
62 రన్స్ ఆధిక్యం.. చేతిలో ఇంకో 9 వికెట్లు.. కావాల్సినంత సమయం.. కనీసం 200 ప్లస్ రన్స్ చేసినా గత టూర్లో ఇదే మైదానంలో సాధించిన విక్టరీని రిపీట్ చేసేందుకు భారత్ ముందు సువర్ణావకాశం.! శనివారం ఆటకు ముందు ఫ్యాన్స్ ఇలా లెక్కలేసుకున్నారు. కానీ 16 ఓవర్ల వ్యవధిలో అంతా తలకిందులైంది. మధ్యాహ్నం ఒక గంట ఆట అత్యంత చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. కమిన్స్, హేజిల్ వుడ్ విరుచుకుపడటంతో మన బ్యాట్స్మెన్ అంతా నేల చూపులు చూశారు. 9/1 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆదిలోనే నైట్వాచ్మెన్ బుమ్రా వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పుజారా ఔట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
అయితే వికెట్ కాపాడుకోవాలనే ఆలోచనతో భారత బ్యాట్స్మెన్ డిఫెన్స్కు పరిమితమయ్యారు. కానీ పిచ్పై ఎక్స్ట్రా బౌన్స్ ఉండటంతో ఈజీగా వికెట్లు పారేసుకున్నారు. ఇలా కాకుండా ఏ ఒక్క బ్యాట్స్మన్ అయినా వన్డే తరహాలో బౌలర్లపై ఎదురు దాడికి దిగుంటే భారత్ కనీసం 150 పరుగులైనా చేసుండేది. అప్పుడు ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచి పోరాడేందుకు వీలుండేది.

ప్రణాళికల్లేవ్ ..
ఇక తొలి ఇన్నింగ్స్లో లీడ్ దక్కిందనే అత్యుత్సాహమో ఏమో కానీ.. భారత బ్యాటింగ్ విభాగం ఎలాంటి ప్రణాళికలు లేకుండా బరిలోకి దిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన తప్పులను కూడా సరిదిద్దుకోలేకపోయింది. ఆసీస్ పేసర్లకు తగ్గట్టు ప్రణాళికలను రచించలేకపోయింది. మొత్తం ఈ మ్యాచ్ల్లో టీమ్ మేనేజ్మెంట్ ప్రణాళికల లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఆదిలోనే దెబ్బతీసిన భారత బౌలర్లు.. టెయిలండర్లను త్వరగా పెవిలియన్ చేర్చలేకపోయారు. ఆస్ట్రేలియా స్కోరు 111/7 చూస్తే భారత్కు వందకు పైగా ఆధిక్యం ఖాయమనిపించింది. అయితే కెప్టెన్ పైన్ బాధ్యతాయుత బ్యాటింగ్తో తన జట్టును గట్టెక్కించాడు. పరిస్థితిని గమనించి ఎదురుదాడికి దిగిన అతను చక్కటి బౌండరీలతో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 68 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఇలా మన బ్యాట్స్మన్ కూడా రెండో ఇన్నింగ్స్లో ఎదురు దాడికి దిగాల్సింది.

చెత్త ఫీల్డింగ్.. క్యాచ్లు నేలపాలు...
మైదానంలో భారత జట్టు పేలవ ఫీల్డింగ్ కూడా ఓటమికి కారణమైంది. రెండో రోజు మూడు సునాయాస క్యాచ్లు మన ఆటగాళ్లు జారవిడిచారు. వీటిని అందుకొని ఉంటే ఆసీస్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. షమీ బౌలింగ్లో లబుషేన్ (అతని స్కోరు 16) ఇచ్చిన క్యాచ్ను బౌండరీ వద్ద తప్పుడు అంచనాతో పరుగెత్తుతూ పట్టబోయి బుమ్రా వదిలేశాడు. ఆ తర్వాత రెండు సార్లు బుమ్రా బౌలింగ్లోనే లబుషేన్ (స్కోరు 21) క్యాచ్ను స్క్వేర్లెగ్లో పృథ్వీ షా... పైన్ (స్కోరు 26) ఇచ్చిన క్యాచ్ను స్క్వేర్లెగ్లో మయాంక్ పట్టలేకపోయారు.
వీటికి తోడు చివర్లో స్టార్క్ (స్కోరు 12) కష్టసాధ్యమైన క్యాచ్ను వెనక్కి వెళుతూ పట్టే ప్రయత్నంలో సాహా విఫలమయ్యాడు. ఈ క్యాచ్లను పట్టుంటే ఆసీస్ ఇంకా తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది. అప్పుడు ఆ జట్టు తీవ్ర ఒత్తిడికి లోనై భారత్కు అవకాశం ఉండేది.

మలుపు తిప్పిన రనౌట్.!
భారత ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ అనూహ్య రనౌట్ కూడా ప్రత్యర్థికి అవకాశం ఇచ్చింది. రహానే-కోహ్లీ క్రీజులో నిలదొక్కుకోవడంతో పటిష్ట స్థితిలో నిలిచిన భారత్.. విరాట్ రనౌట్తో ఒక్కసారిగా తలకిందులైంది. నాథన్ లయన్ వేసిన 77వ ఓవర్లో రహానే ఫ్లిక్ షాట్ ఆడి క్విక్ సింగిల్కు పిలుపునివ్వగా.. వికెట్ల మధ్య వేగంగా ఉండే విరాట్ హాఫ్ పిచ్ దాటాడు. కానీ బంతిని హజెల్ వుడ్ అందుకోవడాన్ని గమనించిన రహానే వెనక్కి వెళ్లిపోవడంతో విరాట్ పిచ్ మధ్యలోనే ఆగిపోయాడు. ఈ లోపు హజల్ వుడ్ బంతిని లయన్కు అందించడంతో విరాట్ రనౌట్ కాకతప్పలేదు.
దాంతో నాలుగో వికెట్కు నమోదైన 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇదే మ్యాచ్ను ఆసీస్ వైపు టర్న్ చేయగా.. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ మరో 56 పరుగుల వ్యవధిలోనే ముగిసింది. విరాటే రనౌట్ కాకుంటే అతను సులువుగా సెంచరీ చేసేవాడు. అప్పుడు భారత్ 300 మార్క్ను దాటి మెరుగైన విజయవకాశాలుండేవి.


Click it and Unblock the Notifications












