
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఇంట్లో ట్రేడ్మిల్ చేస్తుండగా హార్ట్ ఎటాక్కు గురైన టీమిండియా మాజీ కెప్టెన్ శనివారం స్థానిక వుడ్ల్యాండ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. దాదా హార్ట్లో మూడు బ్లాక్స్ గుర్తించిన డాక్టర్లు వెంటనే సర్జరీ చేసి ఒక స్టెంట్ వేశారు. దాంతో దాదాకు ప్రాణాపాయం తప్పింది. అయితే దాదా గుండెపోటుకు గురవ్వడం ఆదానీ గ్రూప్కు చెందిన ఆదానీ విల్మార్ కంపెనీని చిక్కుల్లో పడేసింది.
ఆ కంపెనీకి చెందిన ఫార్చ్చూన్ రైస్ బ్రాన్ ఆయిల్కు గంగూలీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఫార్చ్యూన్ ఆయిల్ ఉత్పత్తులపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు, జోకులు పేలుతున్నాయి. బ్రాండ్ అంబాసిడర్కే గుండెపోటు వచ్చిందని, ఫార్చ్యూన్ ఆయిల్ వాడవద్దని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అదాని కంపెనీ ఆయిల్ వాడటం వల్ల గుండెపోటు వస్తుందని ప్రచారం చేస్తున్నారు. దాంతో గంగూలీతో ఉన్న అన్ని ప్రకటనలన్నిటిని ఆదానీ విల్మార్ కంపెనీ తక్షణమే నిలిపివేసింది.
ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగానే ఉందని బుధవారం డిశ్చార్జి చేయనున్నట్లు సోమవారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే మరికొన్ని రోజుల్లో లేదా వారాల్లో అతనికి మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రి ఎండీ, సీఈవో రూపాలి బసు తెలిపారు. ప్రముఖ కార్డియాలజిస్టు దేవీ శెట్టి మంగళవారం గంగూలీని పరీక్షించిన తర్వాత తదుపరి చికిత్స గురించి వైద్యులకు సూచనలిస్తారని ఆమె చెప్పారు.
'ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఇప్పుడే యాంజియోప్లాస్టీ చేయాల్సిన అవసరం కనిపించలేదు. కానీ కొన్ని రోజుల్లో కచ్చితంగా యాంజియాప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. బుధవారం డిశ్చార్జి చేస్తాం. తర్వాత కూడా వైద్యులు నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తుంటారు' అని రూపాలి బసు వెల్లడించారు. మరోవైపు గంగూలీని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి జై షా పరామర్శించారు.