న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాజీ ఛైర్మన్ రమీజ్ రాజాపై భారత అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్పై రమీజ్ రాజా సానుకూల వ్యాఖ్యలతో పాటు ప్రశంసల జల్లు కురిపించడాన్ని అభిమానులు తప్పుబడుతున్నాడు. పీసీబీ ఛైర్మన్గా మిలియన్ డాలర్ల లీగ్ అంటూ ఎగతాళీ చేసిన రమీజ్ రాజా.. పదవి కోల్పోయిన తర్వాత బతుకు దెరువు కోసం ఐపీఎల్ లీగ్ను కొనియాడుతున్నాడని మండిపడుతున్నారు.
ఇటీవలే ఐపీఎల్ 2023 సీజన్ ముగియడంతో రమీజ్ రాజా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడాడు. ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్ ధోనీ కోసమే అన్నట్లు సాగిందని తెలిపాడు.

'ఐపీఎల్ 2023 సీజన్ ధోనీ కోసం, ఎల్లో జెర్సీ కోసం గుర్తుండిపోతుంది. ధోనీ మేనియా, అతని కెప్టెన్సీ, వినయం, ప్రశాంతత, అతని కీపింగ్ నైపుణ్యాలు.. అన్ని తరాల వారికి గుర్తుండిపోతాయి. ఈ సీజన్లో అన్నింటికంటే.. ముఖ్యంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన షర్ట్పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న క్షణం ఎప్పటికీ నిలిచిపోతుంది.
ధోనీకి ఇంతకంటే పెద్ద ప్రశంసలు ఉండవు. రింకు సింగ్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ లాంటి యువ బ్యాటర్లను ఈ ఐపీఎల్ వెలుగులోకి తీసుకువచ్చింది. రాబోయే చాలా సంవత్సరాలు ఈ మైదానాలను అలంకరించే స్టార్లు వీరే'అంటూ రమీజ్ ప్రశంసల జల్లు కురిపించాడు.
ఇక ఈ 16వ ఎడిషన్ను అత్యుత్తమ సీజన్గా రమీజ్ రాజా అభివర్ణించాడు. ఈ ఐపీఎల్ వేదికపై ఉన్న పెద్ద ఆటగాళ్లకు.. అలాగే చిన్న దేశాల నుంచి వచ్చి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఈ సీజన్లా ఎప్పుడూ జరగలేదు' అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.
పీసీబీ ఛైర్మన్గా ఉన్నప్పుడు టీ20 వరల్డ్ కప్లో టీమిండియా వైఫల్యాలను ఎగతాళి చేస్తూ రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. మిలియన్ డాలర్ల లీగ్ ఆటగాళ్లకు గెలిచే సత్తా లేదా? అంటూ ఎటకారంగా మాట్లాడాడు. ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో చోటు చేసుకున్న రాజకీయాలతో రమీజ్ రాజా తన పదవిని కోల్పోగా.. నజమ్ సేథీ మళ్లీ బాధ్యతలు అందుకున్నాడు.