
కరాచీ: భారత బ్యాట్స్మెన్లో ఒకప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఫేవరెట్గా ఉండేవాడని, ఇప్పుడు ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ అని పాకిస్థాన్ మాజీ పేసర్ ఉమర్గుల్ అన్నాడు. ఇక తన అభిప్రాయం మార్చుకోవడానికి గల కారణాన్ని తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
'ఒకప్పుడు భారత జట్టులో నాకు సచిన్ అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడైతే విరాట్ కోహ్లీ. నాలుగైదేళ్లుగా అతను ఆడుతున్న విధానం నన్ను ఆకట్టుకుంది. తనని తను మార్చుకున్న విధానం, అలాగే ఒకప్పుడు మాతో ఆడినప్పటికీ, ఇప్పటికీ మైదానంలో అతడు ప్రవర్తించే తీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడతని పూర్తి ధ్యాస క్రికెట్పైనే నెలకొంది. అతను బ్యాటింగ్ చేస్తుంటే చూడటం సంతోషాన్నిస్తుంది. అది నేనెంతో ఆస్వాదిస్తాను' అని గుల్ చెప్పుకొచ్చాడు.
భారత క్రికెట్లో కోహ్లీని సచిన్తో పోల్చడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. గత కొన్నేళ్లుగా కెప్టెన్గా ఎంతో నిలకడగా రాణిస్తున్నాడు. తన బ్యాటింగ్తో సచిన్ రికార్డులన్నీ తిరగ రాస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఇప్పటికే 70 అంతర్జాతీయ శతకాలు సాధించాడు. అతడి వయసును పరిగణలోకి తీసుకుంటే రాబోయే కాలంలో సచిన్ 100 శతకాల్ని సైతం అధిగమించేలా ఉన్నాడు. ఇక పరుగుల విషయానికొస్తే కోహ్లీ కాస్త వెనకే ఉన్నాడు. ఇక సచిన్ వన్డేల్లో 18426, టెస్టుల్లో 15921 పరుగులు చేశాడు. కోహ్లీ వన్డేల్లో 11,867 చేయగా టెస్టుల్లో 7240తో కొనసాగుతున్నాడు.