ఈ తరం అత్యుత్తమ బ్యాటర్ ఎవరు? అనే ప్రశ్నకు ఎక్కువ మంది సమాధానం చెప్పే పేరు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో కోహ్లీ నెలకొల్పిన రికార్డులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. దిగ్గజ క్రికెటర్ల నుంచి ఈ తరం ఆటగాళ్ల వరకు అందరూ కోహ్లీనే ది బెస్ట్ అంటూ మెచ్చుకుంటారు.
కానీ పాకిస్థాన్ మాజీ పేసర్ సోహైల్ ఖాన్ మాత్రం భిన్నమైన సమాధానమిచ్చాడు. విరాట్ కోహ్లీ కంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో నయమని, అత్యుత్తమ బ్యాట్స్మన్ అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

పాకిస్థాన్ తరఫున 9 టెస్ట్లు, 13 వన్డేలు, ఐదు టీ20లు ఆడిన సోహైల్ ఖాన్.. 2015 వన్డే ప్రపంచకప్ కూడా ఆడాడు. తాజాగా ఓ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతన్ని.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల్లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరా? అని ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'కోహ్లీ అంటే నాకు గౌరవం ఉంది. ఎందుకంటే అతను చాలా పెద్ద బ్యాట్స్మన్. కానీ ఓ బౌలర్గా నాకు విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మనే అత్యుత్తమ బ్యాటర్. కోహ్లీ కంటే అతను ఎంతో నయం. రోహిత్ టెక్నిక్ అద్భుతం. హిట్ మ్యాన్ బంతిని చాలా ఆలస్యంగా ఆడుతాడు. అతను ఆల్టైమ్ బ్యాటర్.
విరాట్ కోహ్లీ తన ఫిట్నెస్తో పరుగులు చేస్తాడు. అతను ఒక పరుగు చేసిన వెంటనే మరో పరుగు చేసేందుకు సిద్దమవుతాడు. రోహిత్ మాత్రం అలా కాదు. ఒక పరుగు చేసిన తర్వాత మరో పరుగు కోసం కనీస ప్రయత్నం చేశాడు. తన బ్యాట్తోనే పరుగులు చేస్తాడు. కోహ్లీ మాత్రం బ్యాట్తో పాటు వికెట్ల మధ్య పరుగెత్తుతూ పరుగులు రాబడుతాడు. ఇంది మంచి విషయమే ఎందుకంటే అంత ఫిట్గా ఉంటేనే వికెట్ల మధ్య పరుగెత్తడం సాధ్యమవుతోంది.'అని సోహైల్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
భారత్తో సోహైల్ ఖాన్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. 2015 వన్డే ప్రపంచకప్లో అడిలైడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో సోహైల్ ఖాన్ 5 వికెట్లతో సత్తా చాటాడు.