ఇంగ్లండ్ గడ్డపై చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో ఆఖరి టెస్ట్ ఆఖరి రోజు ఆటలో భారత బౌలర్లు వాజిలిన్ సాయంతో బాల్ ట్యాంపరింగ్ చేసి ఉంటారని ఆరోపించాడు. అందుకే 80 ఓవర్ల తర్వాత కూడా బంతి కొత్తదానిలా మెరుస్తూ కనిపించందన్నాడు. అంపైర్లు ఆ బంతిని టెస్టుల కోసం ల్యాబ్కు పంపాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
ఇంగ్లండ్తో సోమవారం ముగిసిన ఆఖరి టెస్ట్లో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఆఖరి పోరులో పడిలేచిన టీమిండియా .. మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్తో గెలుపొందింది. 374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్నైట్ స్కోర్తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులు సాధించింది.

ఈ విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన షబ్బీర్ అహ్మద్.. భారత్పై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. 'నాకు తెలిసి భారత్.. వాజిలైన్ ఉపయోగించి ఉంటుంది. అందుకే 80 + ఓవర్ల తర్వాత కూడా కొత్త బంతిలా మెరుస్తూ కనిపించింది. ఆ బంతులను అంపైర్లు టెస్ట్ల కోసం ల్యాబ్కు పంపించాలి.'అని తన ట్వీట్లో పేర్కొన్నాడు.
అయితే భారత్ గెలిచిందనే అక్కసుతోనే షబ్బీర్ అహ్మద్ ఈ ఆరోపణలు చేస్తున్నాడని భారత అభిమానులు మండిపడుతున్నారు. చట్ట విరుద్ధమైన బౌలింగ్తో ఏడాది నిషేధానికి గురైన షబ్బీర్ అహ్మద్ కూడా ఆరోపణలు చేస్తున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. 80 ఓవర్ల తర్వాత కొత్త బంతి తీసుకుంటారనే కనీస అవగాహన కూడా షబ్బీర్ అహ్మద్కు లేదని మండిపడుతున్నారు.
మీడియం పేసర్ అయిన షబ్బీర్ అహ్మద్.. పాక్ తరఫున 10 టెస్ట్లు, 32 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్దంగా ఉందని 2005లో ఐసీసీ ఏడాదిపాటు నిషేధం విధించింది. ఆ తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయలేకపోయాడు. 2007లో రిటైర్మెంట్ ప్రకటించాడు.