IPL ముందు పీఎస్ఎల్, బీబీఎల్ జూజూబీ: పాక్ మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ: తమ ప్లేయర్లను ఇతర ఫ్రాంచైజీల లీగ్స్ ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సరైన పనే చేస్తుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు. ఈ విషయంలో బీసీసీఐని చూసి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నేర్చుకోవాలన్నాడు. భారత ఆటగాళ్లు ఐపీఎల్ మినహా మరే విదేశీ లీగ్ ఆడేందుకు బీసీసీఐ అనుమతివ్వని విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో భారత క్రికెట్ బోర్డుపై తరుచూ విమర్శలు వినిపిస్తాయి. భారత క్రికెట్తో తెగతెంపులు చేసుకున్న తర్వాతే విదేశీ లీగ్స్ ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ అనుమతి లభిస్తోంది. తాజాగా భారత ఆటగాళ్లు పీఎస్ఎల్ ఎందుకు ఆడరని ఎదురైన ప్రశ్నకు కమ్రాన్ అక్మల్ తనదైన శైలిలో బదులిచ్చాడు.

PSL ఆడాల్సిన కర్మ భారత్ ఆటగాళ్లకు లేదు..
తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లకు పీఎస్ఎల్ ఆడాల్సిన అవసరమే లేదన్నాడు. 'తమ ఆటగాళ్లను ఓవర్సీస్ లీగ్స్ ఆడకుండా బీసీసీఐ సరైన పని చేస్తోంది. ఐపీఎల్ రెండు నెలల పాటు జరగడంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఎక్కువ ఆడాల్సి ఉంటుందనే విషయం బీసీసీఐకి తెలుసు. అంతేకాకుండా భారత ఆటగాళ్లు అర్థికంగా చాలా బలవంతులు. భారత ఆటగాళ్లలో ఎవరికి కూడా విదేశీ లీగ్స్ ఆడి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు.

పీసీబీ నేర్చుకోవాలి..
మన బోర్డు కూడా ఆటగాళ్ల కెరీర్ సుదీర్ఘ కాలం పాటు కొనసాగేలా బీసీసీఐని చూసి నేర్చుకోవాలి. భారత్లో కనీసం 14-15 మంది ఆటగాళ్లు 100 టెస్ట్ మ్యాచ్లు ఆడి ఉంటారు. పాక్లో అయితే ఒకరిద్దరు కూడా ఉండరు. భారత్ తమ క్రికెట్కు, ప్లేయర్లకు విలువ ఇస్తోంది. ఐపీఎల్ ద్వారా భారత ఆటగాళ్లకు చాలా డబ్బు వస్తోంది. ఐపీఎల్ ముందు బీబీఎల్, పీఎస్ఎల్ జుజుబీ.. ఏ లీగ్ కూడా ఐపీఎల్తో పోటీ పడలేదు.'అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు. అరంగేట్ర ఐపీఎల్ సీజన్ ఆడిన కమ్రాన్ అక్మల్.. రాజస్థాన్ రాయల్స్ టీమ్కు ప్రాతినిథ్యం వహించాడు. షేన్ వార్న్ సారథ్యంలో తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

బాయ్కట్ చేయాలి..
ఆసియాకప్ 2023 కోసం టీమిండియా పాకిస్థాన్కు రాకుంటే.. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బహిష్కరించాలని కమ్రాన్ అక్మల్ సూచించాడు. పాకిస్థాన్లో జరిగే ఆసియా కప్ను ఆడేందుకు భారత్ అంగీకరించకపోతే.. 2023 వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు అక్కడికి వెళ్లకుండా బహిష్కరించాలి. అయితే, ఈ నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు. ఐసీసీ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే పీసీబీ అయినా దానిపై ఫోకస్ పెట్టాలి.

ఇరు దేశాల ప్రభుత్వాలే..
మేం ప్రపంచ ఛాంపియన్లం, టీ20 ప్రపంచకప్తోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఐసీసీ ర్యాంకింగ్స్లో అన్ని ఫార్మాట్లలోనూ అగ్ర స్థానంలో కూడా నిలిచాం. అయితే, ఐసీసీ, పీసీబీ, బీసీసీఐ చేతుల్లో ఏమీ లేదు. రెండు ప్రభుత్వాల స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఇరు జట్లూ పర్యటించవు. మరి ఇదెంత కాలం కొనసాగుతోంది చూడాలి'అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications