
న్యూఢిల్లీ: భారత ఆటగాళ్లు, అభిమానులపై నోరుపారేసుకోవడం పాకిస్థాన్ మాజీ క్రికెటర్లకు అలవాటుగా మారినట్లు ఉంది. ఆసియా కప్ 2022లో లంక చేతిలో పాకిస్థాన్ ఓటమిని డైవర్ట్ చేసేలా.. పాక్ ఓడిపోవడం భారత్ అభిమానులకు సంతోషం కలిగించి ఉంటుందని పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరొక మాజీ పేసర్ ఆకిబ్ జావెద్ అయితే టీమిండియా యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్పై అక్కసు వెళ్లగక్కాడు.
అర్ష్దీప్ అరకొర ఆటగాడని, అతనికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే సీన్ లేదన్నాడు. ప్రభావిత బౌలర్, గొప్ప బౌలర్ అనే ట్యాగ్ లేదని జావెద్ వ్యాఖ్యానించాడు.'టీ20ల్లో అర్ష్దీప్ బేసిక్ బౌలర్. ఎందుకంటే పొట్టి ఫార్మాట్లో భువనేశ్వర్లా బంతిని స్వింగ్ చేసే బౌలర్ కావాలి. లేకపోతే మంచి యార్కర్లను సంధించగలిగి ఉండాలి. కనీసం గొప్ప బౌలర్ అనే ట్రేడ్మార్క్ అయినా ఉండాలి. అయితే అర్ష్దీప్ సాధారణ బౌలర్ మాత్రమే. అందుకే ఇలాంటి బౌలర్లను ప్రత్యర్థులు పెద్దగా లెక్కచేయరు'' అని జావెద్ వ్యాఖ్యానించాడు.
ఆసియా కప్ సూపర్-4 దశలో పాక్, శ్రీలంక చేతిలో భారత్ ఓడినా.. ఆఖరి ఓవర్లో అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏడు పరుగులను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశాడు. దాదాపు ప్రతి మ్యాచ్నూ చివరి బంతికి తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు 11 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అర్ష్దీప్ టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో స్థానం దక్కించుకొన్నాడు. దీంతో యువ బౌలర్ను టార్గెట్ చేస్తూ ఆకిబ్ జావెద్ నోరుపారేసుకొన్నాడు.