టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ టీమ్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ హఫీజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ జట్టు విజయం కంటే సెంచరీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని తెలిపాడు. 90 పరుగుల మార్క్ చేరిన తర్వాత విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేస్తాడని విమర్శించాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ సైతం ఇలానే స్వార్థపూరితంగా బ్యాటింగ్ చేస్తాడని అభిప్రాయపడ్డాడు.
తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహమ్మద్ హఫీజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ శతకం పూర్తి చేసుకునేందుకు చాలా బాల్స్ ఆడాడని గుర్తు చేశాడు. 'ఎవరి బ్యాటింగ్ ఆడినా.. జట్టు విజయం కోసమై ఆడుతున్నామనే ఇంటెన్షన్తో ఆడాలి. కానీ కొందరు ఆటగాళ్లు 90 పరుగులు చేయగానే షాట్స్ ఆడటం ఆపేస్తారు.

నేను మాత్రం అలా ఎప్పుడూ చేయలేదు. కానీ కొందరు 95 పరుగులకు చేరిన తర్వాత సెంచరీ పూర్తి చేసుకునేందుకు 5 బంతులు ఆడారు. ఆ మూడు నాలుగు బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించరు. కానీ సెంచరీ పూర్తయిన వెంటనే దూకుడుగా ఆడటం మొదలుపెడుతారు. సెంచరీ పూర్తయిన తర్వాత ఇంటెన్షన్ మారినప్పుడు 95 వద్ద అలా ఎందుకు ఆడరు?
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ పూర్తి చేసుకునేందుకు కోహ్లీ చాలా బాల్స్ ఆడాడు. ఒక్క బిగ్ షాట్ కూడా ఆడలేదు. కేఎల్ రాహుల్ కూడా ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన తర్వాత కూడా సంతోషంగా కనిపించలేదు. 2/3తో కష్టాల్లో నిలిచిన స్థితి నుంచి విజేతగా నిలిచిన మ్యాచ్లో సెంచరీ మిస్సయ్యిందని రాహుల్ బాధపడ్డాడు.

ఎక్స్ట్రా కవర్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన షాట్తో సిక్స్ బాది ఆ మ్యాచ్ను ముగించడం నాకింకా గుర్తుంది. భారత్ గెలిచినా కూడా అతను బాధపడ్డాడు. సెంచరీ పూర్తి చేసుకోలేదని అసహనానికి లోనయ్యాడు. ఇది సెల్ఫీష్ అప్రోచ్. విరాట్ కోహ్లీ కూడా సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఇలానే జట్టు విజయం కోసం కాకుండా సెంచరీకి విలువ ఇచ్చాడు.'అని మహమ్మద్ హఫీజ్ చెప్పుకొచ్చాడు.