
ముంబై: భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. ముంబై మాజీ పేసర్, 2006-07 సీజన్ రంజీ ట్రోఫీ విన్నర్ రాజేశ్ వర్మ మరణించాడు. గుండె పోటుతో 40 ఏళ్ల వయసులోనే రాజేశ్ వర్మ తనువు చాలించాడు. ఈ విషయాన్ని రాజేశ్ వర్మ సహచర ప్లేయర్ భావని థక్కర్ ధృవీకరించాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన రాజేశ్ వర్మ.. కెరీర్లో ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు.
2006-07 సీజన్ రంజీ ట్రోఫీని ముంబై టీమ్ గెలవడంలో రాజేశ్ వర్మ కీలక పాత్ర పోషించాడు. 2002-03 సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రాజేశ్ వర్మ.. 2008లో పంజాబ్తో చివరి మ్యాచ్ ఆడాడు. ఏడు మ్యాచ్ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఐదు(5/97) వికెట్ల ఘనత కూడా ఉంది. ముంబై తరఫున 11 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడిన రాజేశ్ వర్మ.. మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు.
రాజేశ్ వర్మ హఠాన్మరణం పట్ల అతని స్నేహితుడు భావని థక్కర్ విచారం వ్యక్తం చేశాడు. తమ కాలంలో ఐపీఎల్ ఉండి ఉంటే రాజేశ్ వర్మ గొప్ప బౌలర్ అయ్యేవాడని చెప్పాడు. ముఖ్యంగా అతను అద్భుతంగా యార్కర్లు వేయగలడని చెప్పుకొచ్చాడు. అండర్ 19 నుంచి తామిద్దం మంచి స్నేహితులమని, అతని అకాల మరణ వార్తతో షాక్కు గురయ్యానని తెలిపాడు. శనివారమే అతనితో 30 నిమిషాలు మాట్లాడానని, ఉదయం 4 గంటలకు అతను మరణించినట్లు వార్త అందిందని భావోద్వేగానికి గురయ్యాడు.