
భారత్కు కంచు కోట వంటి ఇండోర్ స్టేడియంలో టీమిండియా ఓటమిపాలైంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిన ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో అనూహ్యంగా పుంజుకొని రాణించింది. ఈ ఓటమిపై మాజీలు మండిపడుతున్నారు. భారత బ్యాటింగ్ ఘోరంగా విఫలం అవడాన్ని ఎండగడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా దీనిపై స్పందించాడు. భారత టాపార్డర్ చాలా ఘోరంగా ఆడిందని విమర్శించాడు.
'నాగ్పూర్లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ పక్కన పెడితే.. మిగతా రెండు మ్యాచుల్లో టీమిండియా టాపార్డర్ సరిగా పరుగులు చేయలేదు. ఇలా పరుగులు చెయ్యకపోతే మన బ్యాటింగ్లో చాలా చిన్న మార్పు వస్తుంది. తొందరపాటు కనిపిస్తుంది. అందుకే వాళ్లు క్రీజును వదిలి ముందుకు వచ్చి బ్యాటింగ్ చేయడానికి సంకోచించారు. దీంతో ఈ పిచ్ వాళ్లను ఓవర్టేక్ చేసేసింది. భారత బ్యాటర్ల బుర్ర నిండా ఈ పిచ్ ఆలోచనలు నిండిపోయాయి. రెండో ఇన్నింగ్స్లో ఇది మరింత ఎక్కువైంది' అని గవాస్కర్ వెల్లడించాడు. రాహుల్ స్థానంలో ఓపెనర్గా వచ్చిన శుభ్మన్ గిల్ కూడా మూడో టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో మిడిలార్డర్పై ఒత్తిడి పడిందని నిపుణులు అంటున్నారు.
తొలి రోజు నుంచే ఇండోర్ పిచ్ నుంచి బౌలర్లకు సహకారం అందింది. స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే ఆసీస్ స్పిన్నర్లు భారత బ్యాటింగ్ లైనప్ను చాలా ఇబ్బంది పెట్టారు. రెండు ఇన్నింగ్సుల్లో భారత్ ఆలౌట్ అవగా వీటిలో 19 వికెట్లు ఆసీస్ స్పిన్నర్ల ఖాతాలోనే పడటం గమనార్హం. అయితే ఇలా పిచ్ గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాకరించాడు. ఇలాంటి పిచ్లపై ఆడాలని జట్టు మొత్తం కలిసి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశాడు. పిచ్ గురించి కాకుండా లియాన్ బౌలింగ్ గురించో, సెకండ్ ఇన్నింగ్స్లో పుజారా బ్యాటింగ్ గురించో తనను అడిగితే బాగుంటుందని తేల్చిచెప్పాడు.