
చంఢీగడ్: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం లాక్డౌన్ను మే 3వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని, అత్యవసర సమయంలో మినహా బయటకు రావద్దని నిబంధనలను కఠినతరం చేసింది. ఈ రూల్స్ అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే టీమిండి మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ లీడర్ నవజోత్ సింగ్ సిద్దూ మాత్రం మాస్క్ ధరించకుండా పేదలకు ఆహార ప్యాకెట్లు పంచారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది.
దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఓ ఆర్టీఐ కార్యకర్త, న్యాయవాది పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్కు ఫిర్యాదు చేశారు. ఈ మాజీ క్రికెటర్తో పాటు ఆయన కార్యకర్తలు కూడా మాస్క్లు ధరించకుండా అమృత్సర్లో ఆహార ప్యాకెట్లు పంచారని, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. ఇక పంజాబ్ ప్రభుత్వం మాస్క్ల వాడటాన్ని తప్పనిసరి చేయడంతో.. జనాలు గుమిగూడకుండా 144 సెక్షన్ను విధించింది.
ఇక పంజాబ్లో కరోనా బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 197కు చేరగా.. 29 కోలుకున్నారు. 154 మంది చికిత్సపొందుతుండగా.. 14 మంది మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 13473కు చేరుకుంది. మొత్తం 451 మంది మరణించగా.. 1804 మంది కోలుకున్నారు.