ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అనుసరించిన తీరుపై భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ ఆక్షన్ టీమ్ కంటే అభిమానులు అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేవారని వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న ఆర్సీబీ ఆక్షన్ టీమ్ టీమ్ బలహీనతలపై ఫోకస్ పెట్టలేకపోయిందని విమర్శించాడు.
వేలంలో ఎలెమెంటరీ తప్పిదాలు చేసిందని మండిపడ్డాడు. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ దూకుడు ప్రదర్శించలేకపోయింది. రూ. 17.50 కోట్లు పెట్టి కామెరూన్ గ్రీన్ను ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకోవడంతో ఆర్సీబీ దగ్గర ఎక్కువ డబ్బులు లేకుండా పోయాయి.

రూ. 23.25 కోట్లతోనే వేలం బరిలోకి దిగింది. దాంతో కావాల్సిన ఆటగాళ్ల కోసం పోటీ పడలేకపోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం రూ. 20.25 కోట్ల వరకు బిడ్ వేసిన ఆర్సీబీ.. చివరకు సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు బిడ్ వేయడంతో వెనక్కి తగ్గింది.
జోష్ హజెల్ వుడ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లే, మైకేల్ బ్రేస్వెల్ వంటి ఆటగాళ్లను వదులుకున్న ఆర్సీబీ వారి స్థానాలకు తగ్గ ఆటగాళ్లను ఎంచుకోలేకపోయింది.
గతి లేక అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, టామ్ కరణ్, లాకీ ఫెర్గూసన్, సప్నిల్ సింగ్, సౌరవ్ చాహన్ వంటి ఆటగాళ్లను తీసుకుంది. ఈ క్రమంలోనే వేలంలో ఆర్సీబీ వ్యవహరించిన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకకే చెందిన దొడ్డ గణేశ్ కూడా ఎక్స్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
'జట్టు పర్స్లోని సగం డబ్బులను ఆర్సీబీ అభిమానులకు ఇచ్చి.. వేలంలో వారికి కాస్త స్వేచ్చను ఇస్తే.. మన అభిమానులు సమతూకంతో కూడిన అత్యుత్తమమైన జట్టును ఎంపిక చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే జట్టును ఎంపిక చేయడంతో పాటు డబ్బులను కూడా ఆదా చేస్తారు. ప్రొఫెషనల్ క్రికెట్ టీమ్ ఇలా ఎలెమెంటరీ తప్పిదాలు చేస్తుందని అస్సలు నమ్మలేకపోతున్నాను.'అని దొడ్డ గణేష్ ట్వీట్ చేశాడు.
ఆర్సీబీ కొనుగోలు చేసిన ప్లేయర్లు:
అల్జారీ జోసెఫ్- రూ. 11.50 కోట్లు
యశ్ దయాల్-రూ. 5 కోట్లు
టామ్ కరణ్- రూ. 1.5 కోట్లు
లాకీ ఫెర్గూసన్- రూ. 2 కోట్లు
సప్నిల్ సింగ్- రూ. 20 లక్షలు
సౌరవ్ చౌహన్- రూ. 20 లక్షలు