ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తనను బెదిరించారని టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ఆడనని చెప్పినందుకు కెరీర్ నాశనం చేస్తానని బెదరించాడని ప్రవీణ్ కుమార్ గుర్తు చేసుకున్నాడు.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అరంగేట్ర ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి బదులు ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతానని చెప్పినందుకు లలిత్ మోడీ బెదిరించారని గుర్తు చేసుకున్నాడు.

ఐపీఎల్ ఆరంభ సీజన్లో నేను ఆర్సీబీ తరఫున ఆడాలని భావించలేదు. ఎందుకంటే నా స్వస్థలం మీరఠ్కు బెంగళూరు చాలా దూరం. పైగా నాకు ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు. అక్కడి ఫుడ్ కూడా నచ్చేది కాదు. దాంతో నా స్వస్థలానికి దగ్గరగా ఉన్న ఢిల్లీ డేర్ డేవిల్స్ ఫ్రాంఛైజీకి ఆడాలని భావించా.
కానీ ఓ వ్యక్తి.. ఓ పేపర్ మీద నా సంతకం తీసుకున్నాడు. నిజానికి అది ఐపీఎల్ కాంట్రాక్ట్కు సంబంధించిన పేపర్ అని నాకు తెలియదు. ఇదే విషయాన్ని నేను అప్పట్లోనే ఐపీఎల్ చైర్మెన్ లలిత్ మోడీకి చెప్పా. కానీ ఆయన నన్ను బెదిరించాడు. ఒప్పందం ప్రకారం ఆర్సీబీకి ఆడకపోతే.. కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు.'అని ప్రవీణ్ కుమార్ గుర్తు చేసుకున్నాడు.
ఇక పాకిస్థాన్ బౌలర్లు బాల్ టాంపారింగ్ చేసేవాళ్లని ప్రవీణ్ కుమార్ ఆరోపించాడు. 'గతంలో బాల్ టాంపారింగ్ బాగా జరిగేది. పాకిస్థాన్ బౌలర్లే ఎక్కువగా బాల్ టాంపరింగ్ చేసేవారు. దాదాపు ప్రతీ బౌలర్ కూడా బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసేవారు. పాకిస్థాన్ ప్లేయర్లు పైకి ఒకలా.. లోపల మరోలా ఉంటూ ఎక్కువగా అబద్దాలు ఆడేవారు.'అని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
ఇక 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ప్రవీణ్ కుమార్.. 2012లో చివరి మ్యాచ్ ఆడాడు. భారత్ తరఫున 6 టెస్ట్లు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 122 వికెట్లు తీసాడు. ఐపీఎల్లో 119 మ్యాచ్లు ఆడిన అతను 90 వికెట్లు పడగొట్టాడు. 2017లో చివరగా ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు.