టీమిండియా మాజీ హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవి శాస్త్రి ముక్కు సూటితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకు తోచిన మాటలను ఏ మాత్రం సంకోచించకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎంత పెద్ద స్టార్ ఆటగాడి గురించైనా సరే.. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడిస్తాడు. తాజాగా ఓ కార్యక్రమంలోనూ రవిశాస్త్రి ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తాను క్రికెట్ ఆడే రోజుల్లో పందుల్లా తినేవాళ్లమని చెప్పి అందర్ని నవ్వించాడు.
టీమిండియా మాజీ ప్లేయర్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సందీప్ పాటిల్ ఆటోబయోగ్రఫీ 'బీయండ్ బౌండరీస్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రవి శాస్త్రి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఓ ప్యానలిస్ట్ పుస్తకంలో రాసిన ఓ సందర్భాన్ని ప్రశ్నించాడు. సందీప్ పాటిల్, రవిశాస్త్రి రూమ్ మేట్స్గా ఉన్నప్పుడు వారు ఆర్డర్ చేసిన ఫుడ్ను చూసి సర్వీస్ చేసే వ్యక్తి ఆశ్చర్యపోయాడని ఆపుస్తకంలో ఈ పేర్కొన్నారు. ఇది నిజమేనా? అని సదరు ప్యానెల్ మెంబర్ అడిగాడు. ఇందుకు రవి శాస్త్రి తనదైన శైలిలో బదులిచ్చాడు.

'ఈ తరం టెస్ట్ క్రికెటర్లు ఎంత సంపాదిస్తున్నారో అంత కంటే ఎక్కువే నేను, పాటిల్ ఆర్జించాం. అయితే ఏ రోజు కూడా మేం డబ్బులను ఇంటికి తీసుకువెళ్లే వాళ్లం కాదు. టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లినప్పుడు మా నాన్న తరుచూ.. టెస్ట్ మ్యాచ్ డబ్బులు ఏమయ్యాయని అడిగేవాడు. నా దగ్గరు కొంచెం చిల్లర మాత్రమే ఉండేది. ఎందుకంటే మేం పందుల్లా తినేవాళ్లం. మా తిండిని చూసి సర్వీస్ బాయ్ ఆశ్చర్యాని గురైనందుకు నేనేమి ఆశ్చర్యపోలేదు.'అని రవిశాస్త్రి తెలిపాడు.
ఆ వెంటనే సదరు ప్యానెలిస్ట్ తాగుడు గురించి ప్రశ్నించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. 'అదేమి తక్కువ కాదు. యుక్త వయసులో మేం చాలా దాహంగా ఉండేవాళ్లం. 5.30కు మ్యాచ్ ముగిస్తే 6.30 నుంచి మా తాగుడు ప్రారంభమయ్యేది.'అని రవి శాస్త్రి చెప్పాడు.
సందీప్ పాటిల్ మాట్లాడుతూ.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'భారత జట్టు గత పర్యటనలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. కానీ న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయం టీమిండియాకు మేల్కోలుపు వంటిది. గత కొన్నేళ్లుగా టీమిండియా నిలకడగా రాణిస్తోంది. కాబట్టి గత పర్యటన ఫలితాన్ని టీమిండియా పునరావృతం చేస్తుందనే నమ్మకం నాకుంది'అని సందీప్ పాటిల్ చెప్పుకొచ్చాడు.
నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది.