
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరో క్రికెటర్ తండ్రిని బలి తీసుకుంది. టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివ్ ప్రసాద్ కోవిడ్-19తో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆర్పీ సింగే ట్విటర్ వేదికగా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. 'నా తండ్రి శివ్ ప్రసాద్ మరణించారనే వార్తను మీకు తెలియజేస్తున్నందకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.
ఆయన కోవిడ్తో పోరాడుతూ బుధవారం(మే 12) స్వర్గస్థులయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలిగేలా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఓ నమ:శివాయ'అని ఆర్పీ సింగ్ ట్వీట్ చేశాడు. ఆర్పీ సింగ్ తండ్రి మరణం పట్ల భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆయన అకాల మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
ఆర్పీ సింగ్.. తన అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు ఆడి 40వికెట్లు తీశాడు. 58 వన్డేల్లో 69 వికెట్లు, 10 టీ20ల్లో 15 వికెట్ల పడగొట్టాడు. ఇక 82 ఐపీఎల్ మ్యాచుల్లో 90 వికెట్లు తీశాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆర్పీ సింగ్ కీలక సభ్యుడు. 2018లో రిటైర్మెంట్ ప్రకటించిన అతను కామెంటేటర్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
ఐపీఎల్ 2021 సీజన్కు కూడా హిందీ కామెంటేటర్గా సేవలందించాడు. అయితే తన తండ్రి కరోనా బారిన పడటంతో లీగ్ మధ్యలోనే కామెంట్రీ నుంచి తప్పుకున్న ఆర్పీ సింగ్ తన తండ్రిని బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు.
ఇటీవలే క్రికెటర్లు పీయూష్ చావ్లా, రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా తండ్రులు కూడా కరోనాతోనే మృతి చెందిన విషయం తెలిసిందే. పీయూష్ చావ్లా తండ్రి ప్రమోద్ చావ్లా.. పది రోజులుగా మహమ్మారితో పోరాడి శాశ్వత సెలవు తీసుకున్నారు.
ఇక అత్యంత పేద క్రికెటర్ అయిన చేతన్ సకారియా తన ఐపీఎల్ డబ్బులన్నిటినీ తన తండ్రి మెరుగైన చికిత్సకు అందించినా ఫలితం లేకపోయింది. సకారియా తండ్రి కంజి బాయి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండటంతో కరోనాను జయించలేకపోయారు. ఈ జనవరిలోనే సకారియా తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే సకారియా తండ్రిని కోల్పోయాడు.