టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మళ్లీ విషమించింది. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను శనివారం రాత్రి కుటుంబ సభ్యులు మళ్లీ ఆసుపత్రిలో చేర్పించారు. థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేరిన వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కఠింగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే తన చిన్ననాటి సచిన్ టెండూల్కర్ను కలుసుకున్న 52 ఏళ్ల వినోద్ కాంబ్లీ.. అతని అపార్థం చేసుకున్నానని మీడియాకు తెలిపారు. తమ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ మెమోరియల్ కార్యక్రమంలో సచిన్ను కాంబ్లీ కలుసుకున్నారు. ఈ ఈవెంట్లో కాంబ్లీ వీల్చైర్లో కనిపించడంతో అభిమానులు, సహచర ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు.

కాంబ్లీ తీవ్ర అనారోగ్యానికి గురవ్వడం ఇదే తొలి సారి కాదు. గతంలో ఆయన అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ ఈసారి ఆయనకు ఆర్థిక సాయం చేసేందుకు 1983 వరల్డ్ కప్ జట్టు సభ్యులు ముందుకు వచ్చారు. అయితే ఇందుకు వారు ఓ కండిషన్ పెట్టారు. తాగుడు మానేసి రిహాబిలిటేషన్ సెంటర్కు వెళ్తానంటేనే సాయం చేస్తామని చెప్పారు. అందుకు కాంబ్లీ అంగీకరించాడు.
తనకు వచ్చే పెన్షన్తో కాలం వెల్లదీస్తున్నానని, తన కుటుంబ సభ్యులు ఎంతో చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అజయ్ జడేజా తనకు మంచి మిత్రుడని, ఇటీవల తనకు చూడడానికి కూడా వచ్చాడని, 'కమాన్ గెటప్' అంటూ తనను ఉత్సాహపరిచాడని కాంబ్లీ గుర్తుచేసుకున్నారు.
ఆలస్యంగానైనా చాలా మంది ఇప్పుడు తనను చూడడానికి వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. బీసీసీఐ కూడా తనకు అండగా నిలుస్తుందని , అబెయ్ కురువిల్ల (మాజీ ఇండియన్ పేసర్) కూడా బీసీసీఐతో ఉన్నారని, తనతోనూ, తన భార్యతోనూ ఆయన ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారని కాంబ్లీ చెప్పుకొచ్చారు.
సచిన్ తనకు ఎప్పుడూ ఏమీ చేయలేదని అపార్థం చేసుకున్నానని చెప్పారు. గతంలో తనకు జరిగిన రెండు సర్జరీలకు సచినే సాయం చేశాడనే విషయం తర్వాత తెలిసిందన్నారు. తమ స్నేహం ఎప్పటిలాగే ఉందని చెప్పుకొచ్చారు.