లక్నో: టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారును అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్, మీరట్లోని కమీషనర్ నివాస సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొడుకుతో కలిసి ప్రవీణ్ కుమార్ తన లాండ్ రోవర్ కారులో పాండవ్ నగర్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ రోవర్ కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రవీణ్ కుమార్, అతని కొడుకు ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోకుంటే ఇద్దరు ప్రాణాలు కోల్పోయేవారు. రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాద శబ్దాన్ని విని స్థానికులు ఉలిక్కిపడ్డారు. భారీ సంఖ్యలో జనాలు గుమిగూడారు. ట్రక్ డ్రైవర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని మీరట్ ఎస్పీ పియూష్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరీకి ఎలాంటి గాయాలు కాలేదని, ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు సేఫ్గా ఉన్నారని చెప్పారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పాటు ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఇద్దరూ ప్రాణాలతో బయపడ్డారని తెలిపారు.
ఇక రోడ్డు ప్రమాదానికి గురవ్వడం ప్రవీణ్ కుమార్కు ఇదే తొలిసారి కాదు. 2007లో ఓపెన్ జీప్లో మీరట్ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 2007-2011 సమయంలో భారత ప్రధాన పేసర్గా ప్రవీణ్ కుమార్ జట్టులో కొనసాగాడు. 68 వన్డేల్లో 77 వికెట్లు పడగొట్టాడు. 6 టెస్ట్లు, 10 టీ20లు ఆడిన ప్రవీణ్ కుమార్ 27 వికెట్లు తీసాడు.
ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. న్యూఇయర్కు తన తల్లికి సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బీఎమ్డబ్ల్యూ కారులో ఇంటికి బయల్దేరిన రిషభ్ పంత్.. నిద్రమత్తులో డివైడర్ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి అతని కారు పూర్తిగా దగ్దమవ్వగా.. అతను అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ వేగంగా కోటుకుంటున్నాడు.