
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. శుక్రవారం అతనికి కొవిడ్-19 పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో చౌహన్ను లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చౌహన్ పాజిటివ్ రిపోర్ట్తో అతని కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారని, వారంత ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారని జాతీయ చానెళ్లు పేర్కొన్నాయి.
ఇక క్రికెట్ ప్రపంచంలో కరోనా వైరస్ బారిన పడిన మూడో మాజీ అంతర్జాతీయ క్రికెటర్ చౌహన్ కాగా.. తొలి భారత క్రికెటర్. ఇప్పటి వరకు భారత మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు ఈ మహమ్మారి బారిన పడలేదు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, స్కాట్లాండ్ మాజిద్ హక్ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఇక ఇంగ్లండ్ పర్యటనకు వేళ్లాల్సిన 10 మంది పాకిస్థాన్ ఆటగాళ్లకు కూడా కరోనా పాజిటివ్ రావడం.. ఆ తర్వాత కోలుకోవడం తెలిసిందే.
ఇక చౌహన్ త్వరగా కోలుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ట్వీటర్ వేదికగా ఆకాంక్షించాడు. శనివారం పాజిటివ్ వచ్చిన బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా కోలుకోవాలని ప్రార్ధించాడు. 'చేతన్ చౌహన్ జీ కోవిడ్-19 సోకింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అలాగే బిగ్ బి కూడా'అని చోప్రా ట్వీట్ చేశాడు.
భారత్ తరఫున 7 వన్డేలు, 40 టెస్ట్లకు ప్రాతినిథ్యం వహించిన చౌహన్.. సంప్రదాయక ఫార్మాట్లో 31.57 సగటుతో 2084 రన్స్ చేశాడు. 50 ఓవర్ల ఆటలో 21.85 సగటుతో 153 పరుగులు చేశాడు. రంజీల్లో మహారాష్ట్ర, ఢిల్లీ జట్లకు ఆడిన చౌహన్.. 1981లో అర్జున అవార్డు అందుకున్నాడు.