న్యూఢిల్లీ: టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మకు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అండగా నిలిచాడు. టీమిండియాలో నాలుగో స్థానానికి అతనే సరైనోడని అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రాకుంటే తిలక్ వర్మనే ఆడించాలని సూచించాడు. సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ కంటే తిలక్ వర్మను జట్టులోకి తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డాడు.
'నెంబర్ 4లో సరైన బ్యాటర్ లేరని ఎవరు చెప్పారు? చాలా మంది బ్యాటర్లు ఆ స్థానంలో బ్యాటింగ్ చేయగలరు. నెంబర్ 4 స్పాట్కు ఓ లెఫ్టాండర్గా తిలక్ వర్మ సరైన ఆప్షన్. అతని ఫియర్లెస్ గేమ్.. పరిస్థితులకు తగ్గట్లు ఆడే పరణితి జట్టుకు కలిసొస్తుంది. అతనికి పెద్దగా అనుభవం లేకపోయినా.. అది పెద్ద సమస్యకాదు.

అలాగే యువ లెఫ్టాండర్ జైస్వాల్ను కూడా బ్యాకప్ ఓపెనర్గా జట్టులోకి తీసుకోవాలి. అతనికి అపారమైన ప్రతిభ ఉంది. పైగా అతను నిర్భయంగా బ్యాటింగ్ చేస్తాడు. యువ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేయాలి. అప్పుడే టీమ్ సమతూకంగా ఉంటుంది. జైస్వాల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లను తీసుకోవాలి.
వారు ఫియర్లెస్ గేమ్ ఆడుతారు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, సెలెక్టర్లకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కావాల్సిన ఆటగాళ్లతో బెస్ట్ ఎలెవన్ను ఎంపిక చేసుకోవడమే వారి చేయాల్సిన పని. జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
నా అంచనా ప్రకారం భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లకు ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉంది.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ పర్యటనలో తిలక్ వర్మ సత్తా చాటడంతో అతన్ని ఎంపిక చేయాలని ఎమ్మెస్కే ప్రసాద్, రవి శాస్త్రి, వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
సౌరవ్ గంగూలీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఆసియా కప్ 2023లో బరిలోకి దిగే భారత జట్టును ఆగస్ట్ 21న ప్రకటించనున్నారు. ఆ రోజే సెలెక్షన్ కమిటీ సమావేశమై భారత జట్టును ప్రకటించనుంది.