
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కరోనా బారిన పడ్డాడు. క్రికెట్ గాడ్, భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్కు పాజిటీవ్ అని తెలిసిన గంటల వ్యవధిలోనే తనకు కూడా కరోనా సోకిందని యూసఫ్ ట్వీట్ చేశాడు. 'తేలిక లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అంతకుముందే నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలి'అని యూసఫ్ విజ్ఞప్తి చేశాడు.
ఇక ఇటీవలే ముగిసిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ తరఫున యూసఫ్ పఠాన్ బరిలోకి దిగాడు. రాయ్పూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఇండియా లెజెండ్స్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. శ్రీలంక లెజెండ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 36 బంతుల్లోనే 62 పరుగులు చేసిన యూసఫ్ పఠాన్.. బౌలింగ్లోనూ తిలకరత్నె దిల్షాన్, సనత్ జయసూర్య వికెట్లు పడగొట్టాడు.
అయితే ఈ టోర్నీలో ఆడిన సచిన్, యూసఫ్ ఇద్దరూ కరోనా బారిన పడటంతో ఇండియా లెజెండ్స్ తరఫున ఆడిన క్రికెటర్లలో కంగారు మొదలైంది. వారంతా టెస్ట్లు చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్తో కలిసి వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్గా ఆడగా.. యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, వినయ్ కుమార్, మునాఫ్ తదిరులు ఇండియా లెజెండ్స్ టీమ్కి ఆడి.. టైటిల్ గెలిచిన తర్వాత సచిన్తో కలిసి క్లోజ్గా సెల్ఫీ కూడా దిగారు.
వాస్తవానికి రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్లో ఆడేందుకే ఇంటర్నేషనల్ క్రికెట్కు యూసఫ్ పఠాన్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఊహాగానాలు కూడా వినిపించాయి. రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్ను వీక్షించేందుకు ప్రేక్షకుల్నిస్టేడియంలోకి అనుమతించిన విషయం తెలిసిందే.