
కొలంబో: లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో ఆడేందుకు భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ శ్రీలంక చేరుకున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫానే ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'శ్రీలంకలో ఉన్నాను. ఎల్పీఎల్-టీ20 మ్యాచ్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ప్రయాణం కొత్తగా ఉంది #ఎల్పీఎల్-టీ20,#క్రికెట్'అని పఠాన్ ట్వీట్ చేశాడు.
ఎల్పీఎల్లో కండ్యా టస్కర్స్ జట్టు తరఫున ఆడేందుకు ఇర్ఫాన్ పఠాన్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కండ్యా జట్టులో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్, లంక ఆటగాడు కుషాల్ పెరీరా, లంక టీ20 స్పెషలిష్ట్ కుషాల్ మెండీస్, నువాన్ ప్రదీప్, ఇంగ్లండ్ బౌలర్ లైమ్ ప్లంకెట్ ఉన్నారు. కొలొంబో, కండ్యా, గాలె, దంబుల్లా, జఫ్నా అయిదు ఫ్రాంఛైస్ జట్లు ఈ ఎల్పీఎల్-టీ20లో తలపడనున్నాయి.
కొలొంబో, కండ్యా జట్ల మధ్య తొలి మ్యాచ్ హంబంటోటాలోని మహేంద్ర రాజపక్సే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నవంబర్ 26న జరగనుంది. డిసెంబర్ 13, 14న సెమీ ఫైనల్స్, 16న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్లో 24 టీ20లు, 120 వన్డేలు, 29 టెస్ట్లు ఆడాడు. సంప్రదాయక ఫార్మాట్లో 1105 పరుగులతో పాటు 100 వికెట్లు తీసాడు. వన్డేల్లో 1544 రన్స్తో 173 వికెట్లు తీసిన పఠాన్.. టీ20ల్లో 172 పరుగులతో 28 వికెట్లు పడగొట్టాడు. ఇక 103 ఐపీఎల్ మ్యాచ్ల్లో 1139 రన్స్తో పాటు 80 వికెట్లు తీశాడు.