టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జరుగుతున్న తీరుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వంద వైఖరిని తప్పుబడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్కు ప్రత్యేకమైన షెడ్యూల్ను రూపొందించడం సరికాదంటున్నారు.
క్రికెట్ను మతంలా భావించే భారత అభిమానులకు అనుకూలంగా ఉండే విధంగా టీమిండియా మ్యాచ్లను ఐసీసీ షెడ్యూల్ చేసింది. భారత కాలమానం ప్రకారం టీమిండియా మ్యాచ్లన్నింటినీ రాత్రి 8 గంటలకు జరిగేలా షెడ్యూల్ను రూపొందించింది. భారత్లో రాత్రి మ్యాచ్ అంటే.. అమెరికా, వెస్టిండీస్లో ఉదయం నిర్వహించాలి.

అమెరికా వేదికగా టీమిండియా ఆడిన గ్రూప్ దశ మ్యాచ్లు ఒకే వేదికగా పెట్టడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ టోర్నీ ప్రారంభం నుంచే ఐసీసీ భారత్కు అనుకూలంగా ఉండే నిర్ణయాలే తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బుల కోసం ఐసీసీ ఇంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఏం ఉందనే విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికే ఆసీస్ మీడియా, బ్రిటీష్ మీడియా ఈ వ్యవహారంలో ఐసీసీపై దుమ్మెత్తిపోసాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, మార్క్ బట్చర్, ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఐసీసీ తీరును తప్పుబట్టారు. 'ఇది అన్యాయమని, భారత్కు ఒక రూల్? ఇతరులకో నిబంధనా?' అని ప్రశ్నించారు.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా సాయంత్ర వేళలో ఆడలేదని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. తొలి సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్ ఓటమికి ఐసీసీ అనాలోచిత షెడ్యూలే కారణమని మండిపడ్డాడు. అఫ్గాన్ సెమీస్కు అర్హత సాధించిన తర్వాత విమానం నాలుగు గంటలు ఆలస్యం అవ్వడంతో ట్రినిడాడ్కు సరైన సమయానికి చేరుకోలేకపోయిందన్నాడు. దాంతో ఆ జట్టుకు సరైన ప్రాక్టీస్ లేకుండా పోయిందని చెప్పాడు.
ఇక ఒక జట్టు సెమీఫైనల్ చేరకుండానే ఆ జట్టు ఎక్కడా? ఎప్పుడు నాకౌట్ మ్యాచ్ ఆడుతుందోనని ముందే షెడ్యూల్ చేయడం ఏంటని బట్చర్ ప్రశ్నించాడు. టీమిండియా సెమీఫైనల్ చేరకముందే.. గయనా వేదికగా ఆడించాలని నిర్ణయించారు.
టీమిండియా టీవీ ప్రేక్షకుల కోసం ఐసీసీ ఇలా ముందే షెడ్యూల్ ఖారరు చేసిందని బట్చర్ అసహనం వ్యక్తం చేశాడు. దాంతోనే ఏ ఒక్క కామెంటేటర్ కూడా ఈ టోర్నీ జరిగే తీరు గురించి మాట్లాడటం లేదని, వాళ్లంతా ఐసీసీ బానిసల్లా తయారయ్యారని ఘాటుగా విమర్శించాడు.