ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్(55) కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనాయరోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. గ్రాహం థోర్ఫ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొంది.
'గ్రాహం థోర్ప్ మరణించారనే వార్త చాలా బాధకు గురి చేసింది. ఇంగ్లండ్ అత్యుత్తమ బ్యాటర్లలో గ్రాహం థోర్ప్ ఒకరు. క్రికెట్ కుటుంబానికి ప్రియమైన సభ్యుడు. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఆయన అకాల మృతితో క్రికెట్ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన భార్య అమండా, పిల్లలు, తండ్రి జియోఫ్, కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ మా ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాం'అని ఆ ప్రటకనలో ఈసీబీ రాసుకొచ్చింది.

1993-2005 మధ్య కాలంలో గ్రాహం థోర్ప్ ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 44.66 సగటుతో 16 సెంచరీల సాయంతో 6,744 పరుగులు చేశాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన గ్రాహం.. వన్డేల్లో 37.18 సగటుతో 21 అర్ధసెంచరీలతో 2380 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో సర్రేకు ప్రాతినిథ్యం వహించిన థోర్ప్.. ఆ జట్టుకు 17 ఏళ్ల పాటు ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 241 మ్యాచ్లు, 271 లిస్ట్ -ఏ గేమ్లు ఆడిన థోర్ప్.. కౌంటీల్లో 20,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన అనంతరం కోచ్గానూ పని చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా.. అసిస్టెంట్ కోచ్గా సేవలందించాడు. అయితే, 2022 ఫిబ్రవరిలో ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్లో 4-0తో ఓడిపోయిన అనంతరం కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2022 మార్చిలో అఫ్ఘానిస్థాన్ ప్రధాన కోచ్గా ఎపికయ్యాడు.
అయితే అతను జట్టులో చేరడానికి ముందే తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. రెండేళ్ల పాటు అనారోగ్యంతో బాధపడిన అతను చివరకు ప్రాణాలు కోల్పోయాడు.