టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఒవైస్ షా ప్రశంసల జల్లు కురిపించాడు. రాహుల్ టీమిండియా తదుపరి స్టార్గా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. విరాట్ కోహ్లీ తరహాలో జట్టులో కీలక బ్యాటర్గా మారుతాడని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో రాహుల్.. ఇప్పటికే రెండు శతకాలు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై నాలుగు శతకాలు నమోదు చేసిన రాహుల్.. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్గా నిలిచాడు.
దిలీప్ వెంగ్సర్కార్, సచిన్ టెండూల్కర్లు ఇంగ్లండ్ గడ్డపై చేసిన 4 శతకాల రికార్డును సమం చేశాడు. రాహుల్ ద్రవిడ్ 6 శతకాలతో రాహుల్ కంటే ముందున్నాడు. ఈ సిరీస్లో భారత్ తరఫున శుభ్మన్ గిల్ 607 పరుగులతో టాప్ స్కోరర్ కొనసాగుతుండగా.. పంత్ 425 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 375 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. అతి త్వరలోనే రాహుల్.. శుభ్మన్ గిల్ను వెనక్కి నెట్టి టీమిండియా టాప్ బ్యాటర్గా నిలుస్తాడని ఒవైస్ షా అన్నాడు. తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడిన ఈ ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'ప్రస్తుతం కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయ ఆటగాడిగా మారాడనిపిస్తోంది. కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు అతనే ప్రధాన బ్యాటర్గా ఉండేవాడు. అప్పుడు రాహుల్ సాధారణ బ్యాటర్గానే కొనసాగేవాడు. కానీ ఇప్పుడు రాహుల్ ప్రధాన బ్యాటర్గా మారాడు. వాస్తవానికి అతను రాణించాల్సిన సమయం ఇదే. విరాట్ కోహ్లీ లేకుండా జరుగుతున్న తొలి సిరీస్ ఇది. శుభ్మన్ గిల్ కూడా అద్భుతంగా ఆడాడు. అతను ఇలా ఆడుతాడని నేను అస్సలు ఊహించలేదు. శుభ్మన్ గిల్ కంటే కేఎల్ రాహుల్పైనే టీమిండియా నమ్మకం పెట్టుకోవచ్చు.
కోహ్లీ తరహాలో రాణించగలిగే సత్తా రాహుల్కు ఉందనేది నా అభిప్రాయం. అతని టెక్నిక్, టెంపర్మెంట్ అద్భుతం. మరో 10-15 మ్యాచ్ల్లో రాహుల్.. శుభ్మన్ గిల్ను వెనక్కి నెట్టేస్తాడు. మరో 12 నెలల సమయంలో అతను పరుగుల వరద పారించి టీమిండియా సూపర్ స్టార్గా ఎదుగుతాడు.'అని ఒవైస్ షా పేర్కొన్నాడు.లీడ్స్లో శతకం(137) బాదిన కేఎల్ రాహుల్.. లార్డ్స్లో 100 మరో శతకం సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఐదు టెస్ట్ల సిరీస్లో 1-2తో వెనుకంజలో నిలిచింది. ఇరు జట్ల మధ్య జులై 23 నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.