లండన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జాన్ ఎడ్రిక్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఉత్తర స్కాట్లాండ్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎడ్రిక్ వయసు 83 సంవత్సరాలు కాగా.. ఇంగ్లండ్ తరఫున 77 టెస్ట్లు, 7 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు.
విధ్యంసకర ఓపెనర్గా గుర్తింపు పొందిన జాన్ ఎడ్రిక్.. 1965లో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో (310 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇది ఇంగ్లండ్ తరఫున ఐదో అత్యధిక స్కోర్గా నిలిచింది. ఇందులో 52 బౌండరీలు ఉండడం ఓ రికార్డు. ఓ టెస్టు ఇన్సింగ్స్లో ఇన్ని బౌండరీలు బాదిన రికార్డు ఆయన పేరునే ఉంది.
సుదీర్ఘ ఫార్మాట్లో 12 సెంచరీలు బాదిన జాన్ ఎడ్రిక్.. ఏడు వన్డేల్లో రెండు అర్థశతకాలు సాధించాడు. 1963 నుంచి 1976 వరకు 13 ఏళ్లపాటు ఎడ్రిక్ అంతర్జాతీయ కెరియర్ కొనసాగింది. తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్లోనూ ఎడ్రిక్ ఆడడం విశేషం. ఆ మ్యాచ్లో ఎడ్రిక్ ఫస్ట్ బౌండరీతోపాటు తొలి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఎడ్రిక్ మరణం పట్ల ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, ఆ దేశ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.