
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో ఢిల్లీ మాజీ రంజీ క్రికెటర్ సంజయ్ దోబల్(52) సోమవారం మరణించారు. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించింది. సంజయ్ దోబల్ అకాల మరణం క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిందని డీడీసీఏ సెక్రటరీ వినోద్ తిహారా ఆవేదన వ్యక్తం చేశారు. డీడీసీఏ తరఫున దోబల్కు నివాళులు అర్పించిన వినోద్.. కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దోబల్.. మూడు వారాల క్రితమే కరోనా బారినపడ్డాడు.
ఇక ఎయిర్ ఇండియా టీమ్ కోచ్గా పనిచేసిన సంజయ్.. దీర్ఘకాల వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే కరోనా బారిన పడినట్లు అతని ఒకప్పటి సహచర బ్యాట్స్మెన్ మిథిన్ మాన్హాస్ వెల్లడించాడు. సంజయ్ దోబల్కి భార్య, ఇద్దరు కొడుకులు ఉండగా.. ఇద్దరూ రంజీల్లో ఆడుతున్నారు.
'సంజయ్లో మూడు వారాల క్రితమే కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఇక ఆదివారం అతని పరిస్థితి క్షీనించడంతో అత్యవసరంగా ప్లాస్మా ట్రీట్మెంట్ కూడా చేయించాం. కానీ.. ఈరోజు ఉదయం అతను తుది శ్వాస విడిచాడు. సంజయ్ బ్యాట్స్మెన్గా తన కెరీర్ని ప్రారంభించి.. ఆ తర్వాత ఎయిర్ ఇండియాకి మంచి కోచ్గా ఎదిగాడు. వాస్తవానికి ఫిట్నెస్పై అతను ఎక్కువ శ్రద్ధ కనబర్చేవాడు. కుర్రాళ్లకి కూడా ఫస్ట్ క్రికెట్ కంటే.. ఫిట్నెస్పైనే ఎక్కువగా పాఠాలు చెప్పేవాడు'' అని మిథిన్ మాన్హాస్ తెలిపాడు.
ఢిల్లీ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్మెన్గా రాణించిన సంజయ్.. ఆఫ్ స్పిన్నర్గా కూడా జట్టుకు విజయాల్ని అందించినట్లు అతని సహచరులు గుర్తు చేసుకున్నారు. యువ క్రికెటర్లకి సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండే అతను.. అందరితోనూ సరదాగా మెలిగినట్లు అతని చిన్ననాటి కోచ్ తారక్ సిన్హా వెల్లడించాడు.