అద్భుతమైన క్రికెట్..
ఈ మ్యాచ్ సాగిన తీరును చూసే టెస్ట్ మ్యాచ్ను అద్భుతమైన క్రికెట్గా అభివర్ణించవచ్చని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. 'భారత్, న్యూజిలాండ్ రెండు జట్లూ పలుమార్లు మ్యాచ్లో ఆధిపత్యం చెలాయించాయి. దీంతో రెండు జట్లూ గెలుపొందడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి. టెస్టుల్లో ఆఖరి రోజు 52 బంతులపాటు వికెట్ కాపాడుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం. అందుకే టెస్టు మ్యాచ్ని అద్భుతమైన క్రికెట్గా అభివర్ణించేది. అని సచిన్ ట్వీట్ చేశాడు.
'టెస్టు క్రికెటే అత్యుత్తమ క్రికెట్. ఈ మ్యాచ్ను కాపాడుకునేందుకు న్యూజిలాండ్ అత్యద్భుత పోరాటం చేసింది. టీమిండియా బాగా ప్రయత్నించింది. ఇక ముంబై టెస్టే ఫలితం తీసుకురావాలి'అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
భారత్ పోరాడిన తీరు సూపర్భ్..
ఆఖరి బంతి వరకు టీమిండియా విజయం కోసం పోరాడిందని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. 'ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. న్యూజిలాండ్ను ఓడించడం ఎంత కష్టమో మరోసారి చాటిచెప్పింది. త్రుటిలో విజయాన్ని అందుకోలేకపోవడం ద్వారా టీమిండియా నిరాశకు గురైండొచ్చు. కానీ, స్లో పిచ్పై తిరిగి పుంజుకున్న తీరుకు గర్వపడాలి.'అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఇది అత్యంత గొప్ప ప్రదర్శనని, న్యూజిలాండ్ ఆటగాళ్లను చూస్తుంటే గర్వంగా ఉందని జిమ్మీ నీషమ్ ట్వీట్ చేశాడు.
అసలు సిసలు మ్యాచ్..
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆకట్టుకుందని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. 'టెస్టు క్రికెట్ ఎంత బాగుంది..! ఐదు రోజులూ రెండు జట్లు ఎంతో కష్టపడి ఆడాయి. చివరికి డ్రాగా ముగిసింది. అందుకే మేం టెస్టు క్రికెట్ను అమితంగా ఇష్టపడతాం. ముంబైలో రెండో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూడకుండా ఉండలేకపోతున్నా.'వార్నర్ చెప్పుకొచ్చాడు. 'ఇది అసలు సిసలైన టెస్టు మ్యాచ్. ఇలాంటి థ్రిల్లింగ్ ముగింపు ఇవ్వడానికి రెండు జట్లూ అత్యద్భుమైన ప్రదర్శన కనబరిచాయి. ఈ మ్యాచ్లో సానుకూల అంశాలు పరిశీలిస్తే.. శ్రేయస్ అయ్యర్, అశ్విన్ రాణించిన తీరుకు టీమిండియా చాలా సంతోషిస్తోంది.'అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.
వికెట్ దూరంలో..
చివరి రోజు మిగిలిన తొమ్మది న్యూజిలాండ్ వికెట్లు తీసి సునాయాసంగా మ్యాచ్ గెలుస్తుందనుకున్న భారత్ చివరకు 'డ్రా'తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోమవారం ఆట ముగిసే సమయానికి కివీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (146 బంతుల్లో 52; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.
అయితే రచిన్ రవీంద్ర (91 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు), ఎజాజ్ పటేల్ (23 బంతుల్లో 2 నాటౌట్) కలిసి భారత్కు చివరి వికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. వెలుతురు తగ్గడంతో నిర్ణీత సమయంకంటే 12 నిమిషాల ముందే (కనీసం మరో 3 ఓవర్లు పడేవి) అంపైర్లు ఆటను నిలిపివేశారు. టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలవగా... రెండో టెస్టు శుక్రవారం నుంచి ముంబైలో జరుగుతుంది.