టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ విమర్శలు గుప్పించాడు. కేవలం పేరు, ప్రఖ్యాతలతోనే రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ స్థానంలో మరే ఆటగాడు ఉన్నా అతన్ని తుది జట్టులో నుంచి తప్పించేవారని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది.
సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం జరిగిన మ్యాచ్లోనూ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 16 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేసి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి 13.66 యావరేజ్తో 82 పరుగులే చేశాడు.

తాజాగా రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మాట్లాడిన సైమన్ డౌల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'రోహిత్ శర్మ చేసిన పరుగులే మరే ఆటగాడు చేసినా.. అతనికి మళ్లీ అవకాశం దక్కేది కాదు. ఇదే టోర్నీలో మయాంక్ అగర్వాల్ వంటి ఆటగాళ్లు ఇంతకంటే మెరుగైన ప్రదర్శన చేసినా.. తుది జట్టులో చోటు కోల్పోయారు. కేవలం రోహిత్ శర్మ పేరుతోనే హిట్ మ్యాన్ వరుస మ్యాచ్లు ఆడుతున్నాడు. అతని సామర్థ్యంపై ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ నమ్మకంతో ఉంది. ఏదో ఒక మ్యాచ్లో ఆడకపోతాడా? అనే ఆశతో ఉన్నారు.
ముంబై ఇండియన్స్ తమ జైత్రయాత్రను కొనసాగించాలి. అలా కాకుండా ముంబై ఇండియన్స్ విజయాలు సాధించకపోతే.. రోహిత్ శర్మ పరుగులు చేయకపోతే జట్టుకు సమస్యగా మారుతుంది. రోహిత్ శర్మ ఎంతో ప్రతిభావంతమైన ఆటగాడు. భారత జట్టుకు అతను ఏం చేశాడో మాకు బాగా తెలుసు. ఐపీఎల్లో రోహిత్ శర్మ కంటే మెరుగ్గా ఆడిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ కెప్టెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అతన్ని మించిన ఆటగాడు లేడు. అతని సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఐదు టైటిళ్లు గెలిచింది.'అని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్లో ఇప్పటికే సగం మ్యాచ్లు ముగియగా.. ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు మరో 7 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో కనీసం 5 లేదా 6 మ్యాచ్లు గెలవాలి. లేకుంటే ముంబై ఇంటిదారి పడుతోంది. 2013 తర్వాత రోహిత్ శర్మ ఒక్క సీజన్లో కూడా 500 ప్లస్ రన్స్ చేయలేదు.