
లండన్: శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ప్రతిష్టాత్మక మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా మరో ఏడాది పాటు కొనసాగనున్నాడు. అతని పదవీ కాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించేందుకు ఎంసీసీ సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 24న జరుగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి దీనిపై ఆమోదముద్ర వేయనున్నట్లు ఎంసీసీ బుధవారం ప్రకటించింది.
'కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. అందుకే ఇప్పుడు కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సంగక్కర పదవీ కాలాన్ని పొడిగించాలని కమిటీ నిర్ణయించింది. ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. మామూలుగానైతే అధ్యక్షుని పదవీ కాలం 12 నెలలు మాత్రమే. కానీ అనుకోని పరిస్థితుల్లో దీన్ని పొడిగించే వెసులుబాటు ఉంది. జూన్ 24న జరిగే మా క్లబ్ వార్షిక సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలుపుతాం. సంగక్కర 2021 సెప్టెంబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతాడు'అని క్లబ్ పేర్కొంది.
గతేడాది అక్టోబర్ 1న ఎంసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ శ్రీలంక మాజీ ప్లేయర్... ఈ పదవి చేపట్టిన తొలి బ్రిటిషేతర వ్యక్తిగా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా 1821 నుంచి మొత్తం 168 మంది ఎంసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టగా.. రెండో ఏడాది కొనసాగుతున్న నాలుగో వ్యక్తి సంగక్కరనే కావడం గమనార్హం. ప్రపంచ యుద్దాల సమయంలో కూడా ఇలానే పదవికాలాన్ని పొడిగించినట్లు క్లబ్ పేర్కొంది. శ్రీలంక తరఫున 134 టెస్ట్లు, 404 వన్డేలు, 56 టీ20లకు సంగక్కర ప్రాతినిధ్యం వహించాడు.