టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక సలహా ఇచ్చాడు. విరాట్ కోహ్లీ తన నాచురల్ గేమ్ ఆడాలని చెప్పాడు. దూకుడుగా ఆడటం కంటే సహజశైలిలో ఆడటమే అతనితో పాటు టీమిండియాకు శ్రేయాస్కరం అని అభిప్రాయపడ్డాడు.
14 నెలల సుదీర్ఘ కాలం తర్వాత విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో గతేడాదిన్నరగా.. అతను టీ20లకు దూరంగా ఉన్నాడు. అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. రెండో టీ20లో తనశైలికి భిన్నంగా దూకుడుగా ఆడి 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు.

మూడో టీ20లో మాత్రం గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. తొలి బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ చానెల్ వేదికగా కోహ్లీ బ్యాటింగ్ గురించి మాట్లాడిన కృష్ణమాచారి శ్రీకాంత్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ప్రతీ ఆటగాడికి వారి సొంత గేమ్ ఉంటుంది. అందరూ వారి సొంత గేమ్నే ఫాలో అవ్వాలి. దూకుడుగా ఆడే యశస్వి జైస్వాల్కు టైమ్ తీస్కోని ఆడమంటే అతను ఆడలేడు. అది కరెక్ట్ కాదు కూడా. దూకుడుగా ఆడే ఆటగాళ్లను నెమ్మదిగా ఆడాలని, టైమ్ తీస్కోవాలని చెప్పలేం. రోహిత్ శర్మ కూడా దూకుడుగా ఆడగలడు. తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయగలడు.
కానీ విరాట్ కోహ్లీకి దూకుడుగా ఆడటం రాదు. అతను కాస్త టైమ్ తీసుకొని ఆడే ఆటగాడు. కోహ్లీ తన సహజ శైలినే కొనసాగించాలి. సిక్స్లు కొట్టే విషయంలో కోహ్లీ ఏ మాత్రం దిగులు పడాల్సిన పనిలేదు. ఇన్నింగ్స్ చివర్లో అతనికి దూకుడుగా ఆడగలిగే సత్తా ఉంది. మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అతను భారత్ గెలిపించిన తీరును అందరం చూశాం.
కాబట్టి కోహ్లీ స్ట్రైక్ రేట్, భారీ షాట్లు అనే ఆలోచనను పక్కనపెట్టాలి. అలా కాకుండా సహజశైలికి భిన్నంగా తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతానంటే కుదురదు. తొలి బంతి నుంచే బ్యాట్ను ఊపడం మొదలు పెడితే.. ఒకటి రెండు కనెక్ట్ అవుతాయేమో కానీ.. ప్రతీ బంతి సిక్సర్గా వెళ్లదు. అలా కొట్టడానికి ఇదేం గల్లీ క్రికెట్ కాదు. అంతర్జాతీయ క్రికెట్. కాబట్టి విరాట్ కోహ్లీ తన నాచురల్ గేమ్ ఆడాలి.'అని కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.