టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు అధికారికంగా తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచిన వెంటనే అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు హింట్ ఇచ్చారు.
అందుకు అనుగుణంగా గత 8 నెలలుగా పొలిటికల్ పిచ్పై ప్రాక్టీస్ చేసిన అంబటి రాయుడు.. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.

ఐపీఎల్ 2023 జరుగుతుండగానే సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలను బహిరంగంగానే మద్దతు ప్రకటించిన రాయుడు.. వీలైనప్పుడల్లా వైఎస్సార్సీపీ ప్రత్యర్థులపై తన మాటల తూటలతో బౌన్సర్లు సంధించారు. పార్టీలో చేరేముందు ప్రజలతో మమేకమైన రాయుడు.. తన సొంత జిల్లా గుంటూరులో ముమ్మర పర్యటన చేశారు.
అక్కడి ప్రజలతో మమేకం అవుతున్న ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలించారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ముందు ఓ ప్రముఖ తెలుగు చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై పరోక్షంగా విమర్శలు గుప్పించి తన పొలిటికల్ స్టాండ్ ఏంటో తెలియజేశారు.
రాజకీయాలను అర్థం చేసుకోవడానికి కాస్త టైమ్ కావాలని చెప్పిన రాయుడు.. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు రావాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గుంటూరు జిల్లాలో పర్యటించిన రాయుడు.. మీడియా, సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ తన పని తాను చేసుకున్నారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే స్టెప్ ఔటై ప్రత్యర్థులపై సిక్సర్లు బాదారు. టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కూడా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను రాయుడు తనదైన శైలిలో తిప్పి కొట్టారు.
వైఎస్సార్సీపీ తరఫున అంబటి రాయుడు గుంటూరు ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ముక్కుసూటిగా ఉండే రాయుడికి రాజకీయాలు సెట్ అవుతాయా? అనే సందేహం ఆయన అభిమానుల్లో నెలకొంది.