
పనాజీ: నిర్లక్ష్యంగా రోడ్డుపై చెత్త పడేసినందుకు టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ అజేయ్ జడేజా రూ.5 వేల జరిమానా కట్టాడు. గోవాలో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన ఈ భారత మాజీ క్రికెటర్ అక్కడే నివసిస్తున్నారు. నార్త్ గోవాలోని అల్డోనా గ్రామంలో అతని ఇల్లు ఉంది. అయితే తన పక్కనే ఉన్న నచినోలా అనే గ్రామంలో జడేజా చెత్త పడేసి గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు తప్పును ఒప్పుకొని జరిమానా కట్టాడు. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్ మీడియాకు వెల్లడించారు.
'కొందరు బయట వ్యక్తులు మా గ్రామంలో చెత్త వేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించడానికి కొందరు యువకుల్ని నియమించాం. వారు ఆ బ్యాగ్లను పరిశీలించి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే ఓ బ్యాగ్పై అజయ్ జడేజా పేరుతో బిల్ పేపర్ గమనించాం. మరోసారి చెత్త వేయవద్దని హెచ్చరించాం. అతను తన తప్పును అంగీకరించి రూ. 5వేల జరిమానా కట్టాడు.
అతనిలాంటి పాపులర్ క్రికెటర్ ఇక్కడ ఉంటుంనందుకు ఎంతో గర్వంగా ఉంది. అయితే ఎంతటి సెలబ్రిటీ అయినా పారిశుద్ధ్య నిబంధనలు పాటించాల్సిందే'అని సదరు గ్రామ సర్పంచ్ తృప్తి బండోద్కర్ చెప్పుకొచ్చారు. గోవాలోని అల్డోనా విలేజ్ చాలామంది సెలబ్రిటీలకు సెకండ్ హోమ్గా ఉంటోంది. జడేజా, అమితావ్ ఘోష్తో పాటు మరికొందరు అక్కడే భవనాలు కొనుగోలు చేసి ప్రకృతిని ఆస్వాదిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.
భారత్ జట్టులోకి 1992లో అరంగేట్రం చేసిన అజయ్ జడేజా 15 టెస్టులు, 196 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలో 6 వన్డే సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన అజయ్ జడేజా.. 2000లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్గా కొనసాగుతున్నాడు.