పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా
తాజాగా రికీ పాంటింగ్ మాట్లాడుతూ... 'ఈ సిరీస్ను ఆస్ట్రేలియా గెలవకపోవడం జీర్ణించుకోలేకపోతున్నా. ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గత 5వారాల్లో టీమిండియా పరిస్థితి చూస్తే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ లేడు, గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. సిరీస్ను దాదాపు 20 మంది ఆటగాళ్లతో ఆడారు. మరోవైపు ఆస్ట్రేలియా ఎంతో పటిష్ఠంగా ఉంది. అయినా మేం ఓటమి పాలవ్వడం ఎంతో కష్టంగా ఉంది. ప్రతి టెస్టులో కీలకమైన సమయాల్లో టీమిండియానే పైచేయి సాధించింది. కానీ ఆస్ట్రేలియా సాధించలేకపోయింది. రెండు జట్ల మధ్య ఉన్న తేడా ఇదే. భారత్ గొప్పగా ఆడింది. విజయానికి వారే అర్హులు' అని అన్నాడు.
సుందర్ అనుభవజ్ఞుడిలా ఆడాడు
'వాషింగ్టన్ సుందర్.. 50 టెస్టులు ఆడిన అనుభవజ్ఞుడిగా ఆడాడు. జట్టులో స్థానం కోసం ఆడినట్లుగా నాకు అసలు అనిపించలేదు. మ్యాచ్ గెలిచేందుకే ఆడాడు. ఇక తన కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ ఏడు వికెట్లు తీసి 60కు పైగా పరుగులు సాధించాడు. సుందర్, ఠాకూర్ ఇద్దరూ గొప్పగా ఆడారు. బ్యాట్, బంతితో మెరిశారు. విజయంలో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ అనుభవం ఉన్న నాకు భారత్ సామర్థ్యం ఏంటో తెలుసు. అక్కడ ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ గెలవడం భిన్నమైనది' అని రికీ తెలిపాడు.
'ఏ' జట్టుతో బరిలోకి దిగి
'గత పర్యటనలో టీమిండియా విజయం సాధించినప్పుడు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులో లేరు. కాబట్టి మా జట్టు ఓటమిపాలయ్యామనే అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు ఆసీస్ పూర్తి సామర్థ్యంతో ఉంది. జట్టులో ప్రధాన ఆటగాళ్లు అందరు ఉన్నారు. మరోవైపు భారత్ జట్టులో ప్రధాన ఆటగాళ్లు లేరు. నెట్ బౌలర్లతో మ్యాచ్ ఆడింది. విజయం సాధించింది కూడా. అదే ఆస్ట్రేలియాకు తీవ్ర బాధని కలిగిస్తోంది. ఏ జట్టుతో బరిలోకి దిగి రెండు టెస్టులను భారత్ గెలిచింది. అది కూడా గబ్బాలో విజయం సాధించడం నమ్మలేకపోతున్నా' అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఓటమిరుచి చూపించారు
తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైన తర్వాత రికీ పాంటింగ్ టీమిండియాను తక్కువగా అంచనా వేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో విరాట్ కోహ్లీ కూడా ఉండడం లేదని, భారత్ తిరిగి పుంజుకోవడం అసాధ్యమని, సిరీస్ 4-0తో ఆస్ట్రేలియా గెలుస్తుందని జోస్యం చేసప్పడు. ఇక గబ్బా టెస్టు ఐదవరోజు సమయంలో ఆసీస్ జట్టు డ్రా చేసినా ఓటమితోనే సమానమని, తప్పక గెలవాలని అని అన్నాడు. అయితే భారత యువ ఆటగాళ్లు కంగారూల కంచుకోటను బద్దలు కొట్టారు. 32 ఏళ్ల తర్వాత వారికి అక్కడ ఓటమిరుచి చూపించారు.