అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఛైర్మన్గా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ సెక్రటరీ జై షా బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుంచి ఈ పదవి చేపట్టిన ఐదో వ్యక్తిగా జై షా నిలిచాడు. వచ్చే రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా ఇప్పటికే రికార్డ్ సాధించారు. ప్రస్తుతం జై షాకు 36 ఏళ్లు. చివరగా భారత్ నుంచి శశాంక్ మనోహర్ 2015-20 మధ్య ఐసీసీ ఛైర్మన్గా వ్యవహరించారు. 2019లో బీసీసీఐ సెక్రటరీగా నియమితులైన జై షా.. ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టేవరకు ఈ పదవిలో కొనసాగారు.

ఇక ఐసీసీ ఛైర్మన్గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. జై షా ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని ఐసీసీ ప్రకటించింది. ఈ పదవిని చేపట్టడం గర్వంగా భావిస్తున్నట్లు జై షా తెలిపారు. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్ గేమ్స్లో క్రికెట్ను చేర్చడంపై ఫోకస్ పెడుతానని, మహిళల క్రికెట్ను మరింత అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తానని జై షా తెలిపారు.
ఐసీసీ ఛైర్మన్గా జై షా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో బీసీసీఐకి తిరుగుండదు. ఇప్పటికే క్రికెట్ పెద్దన్న చలామణి అవుతున్న బీసీసీఐకి మరింత పవర్ దక్కనుంది. ఇప్పటికే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో తమ వాదనను గెలింపించుకున్న భారత్.. భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్ను ఒంటి చేత్తో ఏలనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ససేమిరా అన్న పీసీబీ.. చివరకు అంగీకరించింది. కానీ ఓ షరతు పెట్టింది. భవిష్యత్తులో భారత్లో జరిగే టోర్నీల కోసం తాము కూడా ఆ దేశంలో పర్యటించమని, తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని కోరింది. అయితే ఈ ప్రతిపాదనకు ఐసీసీ అంగీకరించే అవకాశం లేదు. పాకిస్థాన్ లేకుండా టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ ముందడుగు వేయవచ్చు. కానీ భారత్ లేకుండా ఆ సాహసం చేయలేదు.