ఢాకా : బంగ్లాదేశ్ మాజీ స్పిన్నర్ ముషారఫ్ హుస్సేన్(38)కు కరోనా సోకింది. అతని తండ్రి నుంచి హుస్సేన్కు కరోనా వ్యాప్తి చెందింది. గత ఏడాది నుంచి హుస్సేన్.. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగు నెలలపాటు చికిత్స తీసుకున్న అతను.. సర్జరీ కూడా చేయించుకున్నాడు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న ఈ మాజీ స్పిన్నర్ తన పరిస్థితిని ఓ మీడియా చానెల్కు తెలియజేశాడు.
'మా తండ్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సీఎంహెచ్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. నాలో కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆదివారం పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతానికి నేను ఆరోగ్యంగానే ఉన్నాను. స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్ర తీసుకుంటున్నా. నా భార్య, బిడ్డకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. దీంతో వారు నా సతీమణి పేరెంట్స్తో ఉంటున్నారు.'అని హుస్సేన్ తెలిపాడు. ఇక ముషారఫ్ హుస్సేన్ బంగ్లాదేశ్ తరఫున 5 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న అతను కోలుకున్న వెంటనే డొమెస్టిక్ క్రికెట్ ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు.
ఇక బంగ్లా మాజీ కెప్టెన్ మష్రాఫ్ మోర్తాజా, మరో ఇద్దరు క్రికెటర్లు నజ్ముల్ ఇస్లాం, నఫీజ్ ఇక్బాల్కు ఈ ఏడాది జూన్లో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గత వారం 18 మంది బంగ్లాదేశ్ ఫుట్బాల్ ప్లేయర్లు మహమ్మారి బారిన పడ్డారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా కరోనాను జయించిన విషయం తెలిసిందే.