
హైదరాబాద్: బ్యాటింగ్, బౌలింగ్లో నువ్వా-నేనా అన్నట్లుగా ఉన్న రెండు మేటి జట్ల పోరాటంలో ముంబై ఇండియన్స్దే పైచేయి అయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టుగా.. స్టార్ల విలువ తెలిసేట్టుగా.. క్వాలిఫయర్-1లో మళ్లీ చెలరేగిపోయింది. ఆల్రౌండ్ షోతో అదరగొడుతూ.. గురువారం జరిగిన క్వాలిఫయర్-1లో బలమైన ఢిల్లీపై 57 రన్స్ భారీ తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.
బ్యాటింగ్లో కుర్రాళ్లు ఇషాన్ కిషన్ (30 బాల్స్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 నాటౌట్), సూర్యకుమార్ (38 బాల్స్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51), డికాక్ (25 బాల్స్లో 5 ఫోర్లతో 1 సిక్స్తో 40), హార్దిక్ (14 బాల్స్లో 5 సిక్సర్లతో 37 నాటౌట్) కుమ్మేస్తే.. బౌలింగ్లో బుమ్రా (4/14), బౌల్ట్ (2/9) చెలరేగడంతో ఎదురొచ్చిన ఢిల్లీ చిత్తు అయింది. ఫలితంగా ప్లే ఆఫ్స్లోకి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినట్లుగానే.. టైటిల్ కోసం ఘనంగా ఆరోసారి అడుగు వేసింది.. మరోవైపు టార్గెట్ ఛేజింగ్లో సున్నాకే మూడు వికెట్లు కోల్పోయి చతికిలపడిన ఢిల్లీని స్టోయినిస్ (46 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65) ఒంటరి పోరాటం గట్టెక్కించలేకపోయింది.
ఆరోసారి టైటిల్ ఫైట్ సిద్దమైన ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ ఐదు ఫైనల్స్ ఆడగా.. నాలుగింటిలో గెలుపొందింది. 2010లో తొలిసారి ఫైనల్ చేరిన ముంబై రన్నరప్తో సరిపెట్టుకుంది. 2013, 2015, 2017, 2019 సీజన్లలో ఆ జట్టు విజేతగా నిలిచింది. ఇప్పటి వరకూ ఆ జట్టు ఫైనల్ చేరిన ప్రతిసారి ప్రత్యర్థి జట్టులో ధోనీ ఉండటం విశేషం.
2017 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడకపోయినప్పటికీ.. రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ తరఫున ధోనీ ఫైనల్ ఆడాడు. స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని పుణే జట్టును ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో ఓడించి కప్ గెలిచింది. అయితే ఐపీఎల్ చరిత్రలో తొలిసారి చెన్నై ప్లేఆఫ్ చేరకుండానే నిష్క్రమించడంతో.. ఈ సీజన్లో రోహిత్ సేన ధోనీ లేకుండా ఫైనల్ ఆడనుంది. అయితే రోహిత్ సారథ్యంలో ఫైనల్కు వెళ్లిన ప్రతీసారి ధోనీ జట్టుపై విజయం సాధించి టైటిల్ నెగ్గిన ముంబై.. 2010లో మాత్రం సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో ఓడింది. ఇప్పుడు ధోనీ లేకపోవడంతో ఫైనల్లో రోహిత్ సేనకు షాక్ తగులుందా? అనే చర్చ ఊపందుకుంది.