టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. 55 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన భారత కెప్టెన్గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ పేరిట ఉన్న చెత్త రికార్డ్ను సమం చేశాడు.
న్యూజిలాండ్తో ముంబై వేదికగా జరిగన మూడో టెస్ట్లో టీమిండియా 26 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో సొంతగడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్ అయ్యింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు ఇది ఘోర పరాజయం. ఈ ఏడాది 11 మ్యాచ్లు ఆడిన టీమిండియాకు ఇది నాలుగో టెస్ట్ పరాజయం.

1969లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ సారథ్యంలోని భారత జట్టు ఒకే ఏడాది నాలుగు టెస్ట్ల్లో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ చేతిలో ఒక మ్యాచ్ ఓడిన భారత్.. ఆస్ట్రేలియాతో మూడు టెస్ట్ల్లో ఓటమిపాలైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఓటమిపాలైంది. తాజాగా న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్కు గురైంది.
బెంగళూరు టెస్ట్లో 8 వికెట్ల తేడాతో చిత్తయిన టీమిండియా.. పుణె టెస్ట్లో 113 పరుగులతో.. ముంబై టెస్ట్లో 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్గా రోహిత్ శర్మ సొంతగడ్డపై ఇప్పటి వరకు 5 పరాజయాలు చవిచూశాడు. సొంతగడ్డపై అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న సారథుల్లో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.
అగ్రస్థానంలో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు. ఆయన సొంతగడ్డపై మొత్తం 9 టెస్ట్ మ్యాచ్ల్లో ఓటమిపాలయ్యాడు. విరాట్ కోహ్లీ మాత్రం సొంతగడ్డపై మూడు టెస్ట్ పరాజయాలనే ఎదుర్కొన్నాడు. టీమిండియా తదుపరి టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా ఆసీస్ గడ్డపై ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో బరిలోకి దిగనుంది.
మరోవైపు భారత గడ్డపై టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. మరే జట్టు కూడా ఇప్పటి వరకు భారత గడ్డపై టీమిండియాను క్లీన్ స్వీప్ చేయలేదు.