చెన్నై: తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్) 2023 సీజన్లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఫీల్డర్ బౌండరీ లైన్ ధాటి పట్టిన క్యాచ్ నెట్టింట వైరల్గా మారింది. గత సోమవారం సెలమ్ స్పార్టాన్స్, దిండిగల్ డ్రాగన్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.
సెలెమ్ టీమ్ ప్లేయర్ ఆర్ కెవిన్ కొట్టిన ఓ భారీ షాట్ను దిండిగల్ ఫీల్డర్ బౌండరీ ధాటి పట్టడం చర్చనీయాంశమైంది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో శరవణ వేసిన బంతిని కెవిన్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడగా సిక్స్గా వెళ్లింది. అదే దిశలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న దిండిగల్ ఫీల్డర్.. బౌండరీ లైన్ ధాటి క్యాచ్ పట్టడం అందర్నీ ఆగ్రహానికి గురి చేసింది.

క్యాచ్ కోసం ప్రయత్నించి ఉంటే కనీసం సిక్సర్ను అయినా ఆపేవాడని అంతా అనుకున్నారు. ఈ క్యాచ్ సమయంలో కామెంటేటర్ అయితే ఇది నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను ఫ్యాన్ కోడ్ ట్వీట్ చేయగా అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదెక్కడి క్యాచ్ మామ... మేం ఏడ చూడలేదని సెటైర్లు పేల్చుతున్నారు. ఫీల్డర్.. బాల్ బాయ్ అనుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో దిండిగల్ డ్రాగన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సేలమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. సన్నీ సంధు(57) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెవిన్(25) పర్వాలేదనిపించాడు. అనంతరం దిండిగల్ డ్రాగన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసి గెలుపొందింది. బాబా ఇంద్రజీత్(83 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ఓపెనర్ విమల్ కుమార్(42) రాణించాడు.
ఆసక్తికర ఘటనలకు టీఎన్పీఎల్ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్లు ఆడాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే సవాల్ చేసి ఈ టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాడు.