తాను మెరుగైన ప్రదర్శన చేసినా భారత సెలెక్టర్లు పట్టించుకోలేదని టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ అన్నాడు. ఆ సమయంలో కాస్త బాధపడినా.. తనకు తాను సర్ది చెప్పుకున్నానని తెలిపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025ని ఇషాన్ కిషన్ సారథ్యంలోని జార్ఖండ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
హర్యానాతో గురువారం జరిగిన ఫైనల్లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని జార్ఖండ్.. 69 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్(49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్లతో 101) విధ్వంసకర శతకంతో జార్ఖండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇషాన్ కిషన్.. ఫలితం ఆశించకుండా తన ప్రయత్నం తాను చేస్తున్నానని తెలిపాడు. ఈ విజయం తన జీవితంలో మరిచిపోలేని అద్భుతమైన క్షణమని చెప్పుకొచ్చాడు. 'నేను భారత జట్టుకు ఎంపిక కానప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను బాగా రాణించినా.. నాకు అవకాశం దక్కలేదు. ఇంకా నేను మెరుగ్గా ఆడలేమోనని నాకు నేను చెప్పుకున్నాను. బహుషా జట్టును గెలిపించాలేమో.. సమష్టిగా రాణించాలేమోనని భావించాను.

ఇలాంటి పరిస్థితుల్లో నిరాశకు గురవ్వకుండా చూసుకోవడం కీలకం. కుర్రాళ్లకు నేను ఇచ్చే సలహా కూడా ఇదే. నిరాశ ఎప్పుడూ మిమ్మల్ని ఒక అడుగు వెనక్కి నెట్టేస్తుంది. నిరాశకు లోనవ్వకుండా మరింత కష్టపడేందుకు ప్రయత్నించాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. లక్ష్యంపై ఫోకస్ పెట్టాలి.
చాలా సార్లు అవకాశం దక్కుతుందని చూస్తారు. కానీ జట్టులో మీ పేరు కనిపించదు. అలాంటి సమయంలో బాధ కలుగుతుంది. నేనైతే అలాంటి స్థితిలో లేను. నేను ఫలితాన్ని పట్టించుకోవడం లేదు. అత్యత్తమ ప్రదర్శన చేయడంపైనే ఫోకస్ పెట్టాను.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయం నా జీవితంలోనే మరిచిపోలేని క్షణం. ఎందుకంటే నా కెప్టెన్సీలో ఎప్పుడూ దేశవాళీ టోర్నీ గెలవలేదు. ఇది మనల్ని మనం నిరూపించుకోవాల్సిన సమయం. కొన్నిసార్లు మనల్ని మనం సందేహించునే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఇలాంటి విజయాలు సాధించినప్పుడు అవన్నీ మరిచిపోతాం. మీ సామర్థ్యం ఏంటో.. మీ ఆటలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో, ఆటను ఎలా మలుపు తిప్పాలో అర్థమవుతుంది. ఈ విజయంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. ముఖ్యంగా నా బ్యాటింగ్పై మరింత విశ్వాసం ఏర్పడింది.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.