
అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. గంటకు 157.3 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి చరిత్ర సృష్టించాడు. తద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ వేసిన బౌలర్గా ఫెర్గూసన్ గుర్తింపు పొందాడు. గతంలో షాన్ టైట్ 157.3 కిలో మీటర్ల వేగంతో బంతిని సంధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా ఫెర్గూసన్ అతని సరస నిలిచాడు.
ఇక ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్లో 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఐదో ఓవర్లో ఫెర్గూసన్ ఈ ఘనతను అధిగమించాడు. అతని వేగానికి బట్లర్ బిత్తరపోయాడు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 60 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్ ఉన్నారు.

ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. లక్షా 25 వేల మంది అభిమానులు హాజరైన మైదానంలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహ్మాన్ తమదైన శైలిలో ఎంటర్టైన్ చేశారు. బాలీవుడ్తో పాటు సౌత్ సినిమా పాటలకూ రణ్ వీర్ సింగ్ స్టెప్పులేశాడు. యశ్ నటించిన కేజీఎఫ్తో పాటు తమిళ నటుడు విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని వాతీ సాంగ్కి కాలు కదిపాడు. బాహుబలితో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్లోని 'నాటు నాటు పాట'ను తెలుగులో ప్లే చేయగా.. రణ్వీర్ సింగ్ స్టెప్పులేయడంతో స్టేడియంలోని అభిమానులు హర్షధ్వానాలతో హోరెత్తించారు.