చివరి ఓవర్లలో అదనంగా పరుగులివ్వడమే తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్ అండర్ 19 కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ అన్నాడు. చివర్లో కాస్త కట్టడిగా చేసి తక్కువ పరుగులు ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. స్లో ఓవర్ రేట్ కూడా తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.
అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్తో ఆదివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ 58 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ ఓటమితో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్ ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ఫర్హాన్ యూసఫ్.. ఈ ఓటమి తీవ్రంగా నిరాశపర్చిందన్నాడు. ఈ మ్యాచ్లో ఓడినా తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని చెప్పాడు. 'ఈ మ్యాచ్ ఆరంభంలో మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. మిడిల్ ఓవర్లలో కూడా మూడు కీలక వికెట్లు తీసాం. కానీ ఆ తర్వాతే మా ప్రణాళిక అదుపు తప్పింది. మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తప్పి బౌలింగ్ చేశారు. ప్రత్యర్థి జట్టు అంత భారీ స్కోర్ చేయడానికి ఇదే ప్రధాన కారణం.
చివరి ఓవర్లలో కూడా ధారళంగా పరుగులిచ్చారు. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లు ఆడటం, స్లో ఓవర్ రేట్ కారణంగా సర్కిల్ బయట ఒక ఫీల్డర్ తగ్గడంతో బౌలర్లకు కష్టంగా మారింది. ఇది చాలా నిరాశ కలిగించే విషయం. ఈ ఓటమి నుంచి మేం కోలుకుంటాం. ఈ మ్యాచ్లో ఓడినా మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను.

ఛేజింగ్లో మ్యాచ్ గెలవడమే మా ప్లాన్. తద్వారా సెమీఫైనల్కు అర్హత సాధించాలనుకున్నాం. మా ప్రాధాన్యత, ప్రణాళిక కూడా ఇదే. కానీ కొన్ని వికెట్లు కోల్పోయిన తర్వాత మా ప్లాన్ పూర్తిగా మారిపోయింది. మేం మ్యాచ్ గెలవాలని మాత్రమే ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తు రెండో ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కు మరింత కష్టంగా మారింది. ఫలితం నాకు అనవసరం. నా జట్టు ప్రదర్శనను చూసి గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను.'అని ఫర్హాన్ యూసఫ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది(98 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 68) హాఫ్ సెంచరీతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 30), కాన్షిక్ చౌహన్(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35), ఖిలాన్ పటేల్(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 21) దూకుడుగా ఆడారు. పాకిస్థాన్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్(3/32) మూడు వికెట్లు తీయగా.. మొహమ్మద్ సయ్యమ్(2/69) రెండు వికెట్లు పడగొట్టాడు. అలీరాజా, అహ్మద్ హుస్సేన్, మోమిన్ ఖమర్, అలీ హసన్ బలోచ్ తలో వికెట్ తీసారు.
అనంతరం పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్(92 బంతుల్లో 7 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. హంజా జహూర్(49 బంతుల్లో 8 ఫోర్లతో 42), ఫర్హాన్ యూసఫ్(39 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్(3/35), ఆయుష్ మాత్రే(3/21) మూడు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. అంబ్రిష్, హెనిల్ పటేల్, కాన్షిక్ చౌహన్, విహాన్ మల్హోత్ర తలో వికెట్ తీసారు.