కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుతో భారత క్రికెట్కు భారీ నష్టం వాటిల్లనుంది. దాదాపు రూ. 7 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు కారణంగా ఫాంటసీ స్పోర్ట్స్ సంస్థలు, ఆన్లైన్ మనీ-బేస్డ్ గేమ్ యాప్స్ పూర్తిగా తమ కార్యకలపాలను నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ గేమింగ్ సంస్థల నుంచే భారత క్రికెట్కు భారీగా ప్రకటనలు వచ్చాయి. కానీ తాజా బిల్లు కారణంగా ఆ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ బిల్లు కారణంగా బ్రాడ్కాస్టర్లు, స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్స్ తీవ్రంగా దెబ్బతింటాయని అడ్వర్టైజింగ్ రంగం నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బిల్లు కారణంగా ఈ రంగమే అతిపెద్ద సవాల్ ఎదుర్కొనుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బిల్లు కారణంగా టీమిండియా జెర్సీ స్పాన్సర్గా ఉన్న డ్రీమ్ 11 బీసీసీఐతో ఉన్న రూ. 358 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఐపీఎల్కు స్పాన్సర్షిప్ చేస్తున్న మై 11 సర్కిల్తో కుదిరిన రూ. 625 కోట్ల ఒప్పందం కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి.

డ్రీమ్ 11 నిష్క్రమణతో టీమిండియా జెర్సీ స్పాన్సర్ లేకుండా ఆసియా కప్ 2025 ఆడనుంది. కొత్త స్పాన్సర్ కోసం అన్వేషణ ప్రారంభించిన బీసీసీఐ.. 2025-28 కాలానికి రూ. 452 కోట్లు రాబట్టాలనే లక్ష్యంతో ఉంది.
ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కోనున్నాయి. ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీలు ఏటా రూ. 5,000 కోట్లను ప్రకటనల కోసం ఖర్చు చేయగా.. ఇతర రియల్-మనీ గేమింగ్ ఆపరేటర్లు మరో రూ. 2000 కోట్లు ఖర్చు చేశాయి. దాంతో మనీ-బేస్డ్ ఆన్లైన్ గేమ్స్ కంపెనీల ప్రకటనల వ్యయం రూ. 7,000 కోట్లకు చేరుకుంది.
భారత క్రికెట్కే కాకుండా ఇతర క్రీడలకు, ఫ్రాంచైజీ లీగ్స్తో పాటు డిజిటల్ ఫ్లాట్ఫామ్స్ గూగుల్, మెటా భారీ నష్టాలను ఎదుర్కోనున్నాయి. భారత ప్రకటనల పరిశ్రమ కూడా కుదేలవ్వనుంది. భారతదేశ స్పోర్ట్స్ మీడియా ఎకో సిస్టమ్లో అతిపెద్ద ఆపరేటర్ అయిన జియోస్టార్ భారీగా నష్టపోయే అవకాశం ఉంది.